ఆ కిడ్నాపర్‌కు జీవితకాల జైలు శిక్ష విధించలేం: సుప్రీంకోర్టు 

2 Jul, 2021 10:50 IST|Sakshi

న్యూఢిల్లీ: డబ్బు కోసం బాలుడిని కిడ్నాప్‌ చేసిన ఓ వ్యక్తి అతడికి హాని తలపెట్టడం, చంపుతానంటూ బెదిరించడం వంటివి చేయకుండా మంచిగానే చూసుకున్నందున భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్‌ 364ఏ ప్రకారం జీవిత కాల జైలు శిక్ష విధించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాలుడిని కిడ్నాప్‌ చేసి రూ.2 లక్షలివ్వాలంటూ అతడి తండ్రిని డిమాండ్‌ చేసినందుకు గాను తనకు జీవిత కాల జైలుశిక్ష విధించడాన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణకు చెందిన అహ్మద్‌ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై గురువారం ధర్మాసనం విచారణ జరిపింది.

డబ్బు కోసం కిడ్నాప్‌ నేరం(సెక్షన్‌ 364ఏ) కింద మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది. అవి..ఎవరైనా వ్యక్తిని నిర్బంధంలో ఉంచుకోవడం, ఆ వ్యక్తిని చంపుతాననీ గానీ, హాని తలపెడతానని గానీ బెదిరించడం, కిడ్నాపర్‌ ప్రవర్తన వల్ల ప్రభుత్వం, విదేశీ ప్రభుత్వం, ఏదైనా ప్రభుత్వ సంస్థ డబ్బు చెల్లించకుంటే బాధితుడికి హాని లేదా ప్రాణహాని కలగవచ్చుననే భయానికి తగు కారణం ఉండటం’అని పేర్కొంది. అయితే, ఇందులో మొదటి అంశం మినహా మిగతా రెండింటికి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ ధర్మాసనం ఈ శిక్షను నిలిపివేసింది.

ఈ–పాస్‌లు తాత్కాలికమే
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో రాజధాని హైదరాబాద్‌కు వెళ్లే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఈ–పాస్‌ తప్పనిసరి చేయడం చట్ట విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ–పాస్‌ల ప్రక్రియ తాత్కాలికమేననీ, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ చెల్లుబాటు కూడా ముగిసిపోయిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

చదవండి:
వైరల్‌: వేటగాళ్ల క్రూరత్వం.. తీరం మొత్తం రక్త సిక్తం..
చట్టాలు మేమెలా రూపొందిస్తాం: సుప్రీంకోర్టు

>
మరిన్ని వార్తలు