Toll Gate​: ‘ఫాస్ట్‌’గా దోచేస్తున్నారు..

7 Jun, 2021 12:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తిమ్మాపూర్‌(కరీంనగర్​): ఫాస్టాగ్‌ పనిచేయడం లేదంటూ వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఘటన తిమ్మాపూర్‌ మండలం రేణికుంట టోల్‌గేట్‌ వద్ద ఆదివారం వెలుగు చూసింది. టోల్‌గేట్‌ వద్ద ఇటీవల ఫాస్టాగ్‌ ఏర్పాటు చేశారు. కొన్ని రోజులుగా ఫాస్టాగ్‌ పనిచేయడం లేదని నిర్వాహకులు వాహనదారుల నుంచి నేరుగా డబ్బులు తీసుకుంటున్నారు.

ఆదివారం ఓ వాహనదారుడు డబ్బులు చెల్లించి కొంత దూరం వెళ్లిన తర్వాత అతడి ఫాస్టాగ్‌ ఖాతా నుంచి డబ్బులు కట్‌ అయినట్లు సెల్‌ఫోన్‌కు మెస్సేజ్‌ వచ్చింది. వెంటనే వెనక్కువచ్చి నిర్వాహకులను నిలదీశాడు. వారు సరైన సమాధానం చెప్పకుండా టోల్‌ప్రీ నంబర్‌కు ఫోన్‌చేసుకోండి. లేదంటే కౌంటర్‌లో వెళ్లి అడగండి అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు.

ఇంతలో మరో ఫాస్టాగ్‌ ఉన్న కారు వచ్చింది. సిబ్బంది అతడి నుంచి కూడా డబ్బులు వసూలు చేశారు. కాసేపటికే అతడి ఫోన్‌కు కూడా ఫాస్టాగ్‌ నుంచి డబ్బులు కట్‌ అయినట్లు మెస్సేజ్‌ వచ్చింది. అయినా సిబ్బంది సరిగా స్పందించలేదు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సాంకేతిక లోపంతో కొంతమందికి ఫాస్టాగ్‌ నుంచి డబ్బులు కట్‌ అయినట్లు మెస్సేజ్‌ వస్తోందని సిబ్బంది తెలిపారు. 

చదవండి: Petrol, diesel price today: కొనసాగుతు‍న్న పెట్రో సెగ

మరిన్ని వార్తలు