సాక్షి, అమీర్పేట: ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసుల సమాచారం మేరకు... యూసుఫ్గూడ స్టేట్ హోంలోని బాలసదనంలోని ప్రియ అనే బాలిక వెంగళరావునగర్లోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం స్కూలుకు వచ్చిన ప్రియ మధ్యాహ్న భోజన విరామ సమయంలో కనిపించకుండా పోయింది. బాలిక ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేనందున పాఠశాల హెచ్ఎం ధనుంజయ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.