సెల్ఫీ తీసుకుంటూ ఫోన్‌తో నీటిలోకి కొట్టుకుపోయిన బాలుడు

10 Apr, 2021 14:54 IST|Sakshi

చిన్నకోడూరు (సిద్దిపేట): సెల్ఫీ సరదా ఓ బాలుడి ప్రాణం మీదకు తెచ్చింది. నీటి ప్రాజెక్ట్‌ చూడడానికి వెళ్లిన బాలుడు అక్కడ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు ప్రాజెక్ట్‌ నీటిలో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ శివారులోని రంగనాయకసాగర్‌ ప్రాజెక్ట్‌ వద్ద జరిగింది. దీంతో సిద్దిపేటలో విషాదం నిండింది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొడుకు ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు.

సిద్దిపేటకు చెందిన వెగ్గలం కార్తీక్‌ (15) తన మిత్రులు చరణ్‌, హేమంత్‌చారి, సాయిచరణ్‌లతో కలిసి చంద్లాపూర్‌ శివారులో ఉన్న రంగనాయకసాగర్‌ ప్రాజెక్ట్‌ చూసేందుకు శుక్రవారం వెళ్లాడు. అక్కడ మొత్తం ప్రాంతం కలియతిరిగి సరదాగా గడుపుతున్నారు. ఈక్రమంలో స్నేహితులతో కలిసి కార్తీక్‌ ఫొటోలు దిగుతున్నాడు. అనంతరం సెల్ఫీ ఫొటో కోసం ప్రయత్నాలు చేశాడు. పంపింగ్‌ చేసే స్థలంలో కార్తీక్‌, చరణ్‌ కలిసి సెల్ఫీ దిగుతుండగా ఒక్కసారిగా కింద ఉన్న మట్టిపెళ్లలు నీటిలోకి జారాయి. దానిపైన నిలబడ్డ కార్తీక్‌, చరణ్‌ ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనతో తోటి మిత్రులు షాక్‌కు గురయ్యారు.

అయితే చరణ్‌ ఓ కట్టె సాయంతో నీటిలో నుంచి బయటపడగా కార్తీక్‌ నీటిలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి కార్తీక్‌ కోసం గాలించారు. గత ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో కార్తీక్‌ మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం కోసం వెతుకుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: డబ్బుల్లేక భార్యతో గొడవ.. కూతుళ్లతో విషం తాగి

మరిన్ని వార్తలు