ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

5 Aug, 2020 11:38 IST|Sakshi
సెల్ఫీ తీసుకుంటున్న సచిన్‌ (ఫైల్‌) 

24 గంటలకు మృత దేహం లభ్యం

పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబ సభ్యులు

ఆదిలాబాద్‌రూరల్‌: సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. రక్షాబంధన్‌ రోజున జలపాతం వద్దకు స్నేహితులతో వెళ్లిన యువకుడు అందులోపడి గల్లంతు కాగా మంగళవారం మృతదేహం లభ్యమైంది. పోలీసుల, కుటుంబ సభ్యుల క థనం ప్రకారం.. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని భీంనగర్‌కు చెందిన డి.సచిన్‌ (20) స్నేహితుడితో కలిసి సోమవారం మండలంలోని ఖండాల జలపాతానికి వెళ్లాడు. సరదాగా సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు జలపాతంలో జారీ పడ్డాడు. దీంతో తోటిమిత్రులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గల్లంతైన యువకుడి కోసం గాలింపు చేపట్టిగా చీకటి పడడంతో ఆచూకీ  లభ్యం కాలేదు. తిరిగి మంగళవారం ఉదయం నుంచే జలపాతం వద్ద గాలింపు చర్యలు చేపట్టగా యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు.

పెద్ద దిక్కుకోల్పోయిన కుటుంబం..
సచిన్‌ తండ్రి ఏడేళ్ల కిందట పాముకాటుతో మృతిచెందాడు. అప్పటి నుంచి తల్లి తిర్వణబాయి సచిన్‌తో పాటు మరో కుమారుడిని చూసుకుంటుంది. ఈ క్రమంలోనే సచిన్‌ ఆదిలాబాద్‌ పట్టణంలో డిగ్రీ చదువుతూ ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఓ టీ హోటల్‌లో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న సచిన్‌ మృతి చెందడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయింది. సచిన్‌ కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి.  

మరిన్ని వార్తలు