ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

11 Oct, 2021 04:45 IST|Sakshi

ఏడుగురికి గాయాలు 

చికిత్స నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలింపు 

పటాన్‌చెరుటౌన్‌(హైదరాబాద్‌): ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలోని ఆదివారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. పటాన్‌చెరు నుంచి ఆదివారం తెల్లవారుజామున సికింద్రాబాద్‌కు బయల్దేరిన బస్సు బస్టాండ్‌ నుంచి బయటకు వచ్చి యూటర్న్‌ తీసుకుంటున్న సమయంలో హైదరాబాద్‌లో చెరకు అన్‌లోడ్‌ చేసి కంకోల్‌ వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది.

ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ వెంకటరమణ, కండక్టర్‌ పద్మావతితో సహా ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. లారీలో చెరకు అన్‌లోడ్‌ చేసేందుకు వచ్చిన మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ అక్కడ్నుంచి పరారయ్యాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న భెల్‌ డిపో మేనేజర్‌ సత్యనారాయణ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సందర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.  

మరిన్ని వార్తలు