‘రెరా’ చైర్‌పర్సన్‌గా సీఎస్‌ శాంతికుమారి 

4 Mar, 2023 02:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్‌పర్సన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేశ్‌కుమార్‌ కూడా రెరా చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఆయన్ను జనవరి 12న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేటాయింపు సబబేనని, అక్కడకు వెళ్లిపోవాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.. రెరా చైర్మన్‌ పదవి ఖాళీ అయింది.

రెరా చైర్మన్‌తోపాటు సభ్యుల నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ కూడా జారీచేసింది. చైర్మన్, సభ్యుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 3 (శుక్రవారం)తో గడువు ముగిసింది. ఇప్పటికే పలువురు మాజీ సీఎస్‌లు, రిటైర్డ్‌ ఐఏఎస్‌లు, టౌన్‌ప్లానింగ్‌లో విశేష అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి రావడానికి కనీసం నెలరోజులు పడుతుందని భావిస్తున్నారు. కొత్త వారిని నియమించే ప్రక్రియ పూర్తయ్యే వరకు రెరా చైర్‌పర్సన్‌గా సీఎస్‌ శాంతికుమారిని నియమిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఉత్తర్వులిచ్చారు. 

మరిన్ని వార్తలు