హైవే ఎక్కుతున్నారా.. ఓసారి జేబులు చెక్‌ చేసుకోండి!

1 Sep, 2022 13:47 IST|Sakshi
షాద్‌నగర్‌ సమీపంలోని రాయికల్‌ టోల్‌ ప్లాజా

భారీగా పెరిగిన టోల్‌ప్లాజా రుసుములు

బెంగుళూరు జాతీయ రహదారిపై ప్రయాణం భారం

నెలవారీ పాసుల ధరలు కూడా భారీగా పెంపు

షాద్‌నగర్‌: టోల్‌ బాదుడు ఏటా కొనసాగుతూనే ఉంది. ఫలితంగా ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది. యథావిధిగా ఈ ఏడాది కూడా టోల్‌ప్లాజాలో ధరలు పెరుగుతుండటంతో జాతీయ రహదారిపై ప్రయాణం మరింత భారం కానుంది. టోల్‌ ప్లాజాలో రుసుములు పెరుగుతుండటంతో అటు వాహనదారులు, ఇటు సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ –బెంగళూరు 44వ జాతీయ రహదారిపై షాద్‌నగర్‌ సమీపంలోని రాయికల్‌ టోల్‌ ప్లాజాలో రుసుము భారీగా పెరిగింది. పెంచిన ధరలు సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. 


ప్రయాణికులపై మరింత భారం
 
బెంగళూరు జాతీయ రహదారిపై ప్రయాణించే వారిపై భారం మరింత పెరగనుంది. ఒకవైపు పెట్రోల్, డీజిల్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రస్తుతం టోల్‌ ధరలు పెంచుతుండడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెంపు సరికాదంటున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణికులు, వాహనదారులకు మరిన్ని సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. జాతీయ రహదారి వెంట సబ్‌వే సరిగా లేకపోవడంతో రోడ్డు పక్కన గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  


ఏటా తప్పని పెంపు
 
షాద్‌నగర్‌ నియోజకవర్గం కొత్తూరు నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల వరకు జాతీయ రహదారిని (సుమారు 58 కి.మీ) రూ.600 కోట్లతో విస్తరించి అవసరమైన చోట బైపాస్‌ నిర్మించారు. ఈ జాతీయ రహదారిని 2009లో కొత్తూరులో ప్రారంభించారు. షాద్‌నగర్‌ పరిధిలోని రాయికల్‌ గ్రామ శివారులో నిర్మించిన టోల్‌ ప్లాజాలో ఏటా టోల్‌ రుసుము పెంచుతూ వస్తున్నారు.   

స్కూల్‌ బస్సుల నుంచి యథావిధిగా..
టోల్‌ ప్లాజాలో నెలవారీ పాసుల రుసుమును కూడా పెంచుతున్నారు. కారు, ప్యాసింజర్, వ్యాను లేక జీపు రూ.2,115 నుంచి రూ.2,425, లైట్‌ కమర్షియల్‌ వాహనాలు, మినీ బస్సులు రూ. 3,700 నుంచి రూ. 4,245, ట్రక్కు, బస్సు రూ.7,395 నుంచి రూ.8,485, మల్టీయాక్సిల్‌ వాహనాలు రూ.11,895 నుంచి రూ.13,635కి పెంచనున్నారు. స్కూల్‌ బస్సుల నుంచి యథావిధిగా నెలవారీగా రూ.1000 వసూలు చేయనున్నారు.  

అన్ని వాహనాలపై బాదుడే..  
టోల్‌గేట్‌లో ఈసారి అన్ని రకాల వాహనాలైన కారు, ప్యాసింజర్‌ వ్యాన్, లైట్‌ కమర్షియల్‌ వాహనాలతో పాటు ట్రక్కు, బస్సు, మల్టీయాక్సిల్‌ వాహనాలు (అనేక చక్రాల వాహనం)లకు రుసుములను భారీగా పెంచనున్నారు. దీంతో టోల్‌ ప్లాజాకు  ఆదాయం కూడా పెరగనుంది. నిత్యం ఈ టోల్‌ ప్లాజా నుంచి సుమారు 15వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.  ప్రతి రోజు సుమారు రూ.28లక్షల మేర ఆదాయం సమకూరుతుంది. టోల్‌ ధరలు పెరుగుతుండటంతో మరో రూ.మూ డు లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.  (క్లిక్‌:  మందుబాబులకు షాక్‌.. తాగేదంతా మద్యం కాదు)


రవాణా రంగంపై తీవ్ర ప్రభావం 

పెట్రోల్, ఢీజిల్‌ ధరల పెరుగుదల, టోల్‌ రుసుములు రవాణా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వాహనాల యజమానులు తమ లారీలను నడపలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మళ్లీ టోల్‌ ధరల పెంపుతో భారం తప్పదు.   
– సయ్యద్‌ సాధిక్, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు 


రుసుము తగ్గించాలి 

కరోనా నేపథ్యంలో సామాన్య, మధ్య తరగతి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టోల్‌ రుసుము పెంచడంతో సామాన్యులపై ఆర్థిక భారం పడుతుంది. రోడ్డుపై ప్రయాణించాలంటేనే భయపడాల్సిన వస్తోంది. రుసుము తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.  
– శివకుమార్,  షాద్‌నగర్‌  

మరిన్ని వార్తలు