22 రోజులకు రూ.1,17,694 కరెంట్‌ బిల్లు.. యాజమాని షాక్‌

8 Sep, 2022 11:53 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి: కరెంటు బిల్లు చూసిన ఓ ఇంటి యజమాని గుండె గు‘బిల్లు’మంది. ఏకంగా లక్ష రూపాయల బిల్లు రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. షాద్‌నగర్‌ మున్సిపల్‌ పరిధి చటాన్‌పల్లిలో రమాదేవి ఇంటికి సంబంధించిన విద్యుత్‌ మీటర్‌ గత నెల కాలిపోయింది. దీంతో ఆశాఖ సిబ్బంది కొత్త మీటర్‌ ఏర్పాటు చేశారు. గత నెలలో కాలిపోయిన మీటర్‌కు సంబంధించిన బిల్లును బుధవారం యజమానికి ఇచ్చివెళ్లారు.

ఇందులో ఆగస్టు 16నుంచి ఈనెల 7వ తేదీ వరకు 22 రోజులకు గానూ 10,510 యూనిట్ల విద్యుత్‌ వాడినట్లు, ఇందుకు రూ.1,17,694 చెల్లించాలని బిల్లులో నమోదైంది. ప్రతి నెల రూ.వందల్లో వచ్చే బిల్లు ఒకేసారి లక్ష రూపాయలు దాటడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై రూరల్‌ ఏఈ రాకేశ్‌ను అడగగా పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని, సరిచేస్తామమన్నారు. 
 

మరిన్ని వార్తలు