సిమ్ స్వాప్‌‌ చేసి లక్షలు కాజేస్తున్న ముఠా అరెస్ట్‌

21 Jan, 2021 13:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సిమ్ స్వాప్‌‌ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నఅంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దశాబ్ద కాలంగా మోసాలకు పాల్పడుతున్న మహారాష్ట్రలోని ముంబైకి చెందిన మీరారోడ్డు గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 40 నకిలీ ఆధార్‌ కార్డులు, 4 రబ్బరు స్టాంపులు, 15 మొబైల్‌ ఫోన్లు, నకిలీ లెటర్‌ ప్యాడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2011 నుంచి సిమ్‌ స్వాప్‌ దందా చేస్తూ రూ.కోట్లు కాజేశారని తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. పలు సంస్థల ఆర్థిక లావాదేవీలు చేస్తున్న ఫోన్‌ నంబర్లనే లక్ష్యంగా చేసుకుని డబ్బులు కాజేస్తున్నారని వివరించారు. ఆ లావాదేవీలు చేస్తున్న మొబైల్‌ సిమ్‌లను బ్లాక్‌ చేసి నిందితులు నగదు కాజేస్తున్నారని తెలిపారు. వీరి బారిన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు మోసపోయారు. వీరిద్దరి నుంచి రూ.11 లక్షలు కాజేశారని చెప్పారు. అయితే ఈ ముఠాకు సంబంధించి దేశవ్యాప్తంగా అనేక అకౌంట్లు ఉన్నాయని గుర్తించినట్లు పేర్కొన్నారు. కాజేసిన డబ్బులను బిట్‌కాయిన్‌, హవాలా ద్వారా నైజీరియాకు పంపిస్తున్నారని వెల్లడించారు.

మరిన్ని వార్తలు