ర్యాపిడ్‌ టెస్ట్‌లకు సింగరేణి 5 వేల కిట్లు

29 Jul, 2020 05:13 IST|Sakshi

హైదరాబాద్‌లోని 3 ఆస్పత్రులతో చికిత్సకు ఒప్పందం

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి సంస్థ ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల కొనుగోలు, ప్రైవేటు ఆసుపత్రులతో అత్యవసర సేవల ఒప్పందం వంటి చర్యలు చేపట్టింది. సంస్థ ఎండీ ఎన్‌.శ్రీధర్‌ నేతృత్వంలో తీసుకున్న చర్యలను సింగరేణి డైరెక్టర్లు ఎస్‌.చంద్రశేఖర్‌ (ఆపరేషన్స్, పా), ఎం.బలరాం (ఫైనాన్స్‌) మంగళవారం ఏరియా మేనేజర్లకు వివరిస్తూ పలు సూచనలు చేశారు. ర్యాపిడ్‌ టెస్టుల కోసం ఐదువేల కిట్లతో పాటు, కరోనా వ్యాధి నివారణ కోసం హెటిరో సంస్థ తయారు చేసిన 1,800 ఖరీదైన ఇంజక్షన్‌ డోస్‌లను కూడా కొనుగోలు చేసినట్లు చెప్పారు. ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లతో పాటు ఈ డోస్‌లను గురువారంలోగా ఏరియా ఆసుపత్రులకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సింగరేణి ఉద్యోగులకు చికిత్స అందించేందుకు హైదరాబాద్‌లో వెంటిలేటర్‌ సౌకర్యం కలిగిన మూడు ఆసుపత్రులతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. 

ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి అదనపు చెల్లింపులు
సింగరేణి ఆసుపత్రులతో పాటు క్వారంటైన్‌ సెంటర్లలో పనిచేసే వైద్య సిబ్బందికి అవసరమైన సహాయ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని సింగరేణి సంస్థ ఎండీ శ్రీధర్‌ సూచించారు. కరోనా వైద్య సేవల్లో పాల్గొంటున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వేతనంతో పాటు రోజుకు రూ.300 చొప్పున అదనంగా చెల్లించాలని సంస్థ నిర్ణయించింది. అన్ని ఏరియా ఆసుపత్రుల్లోనూ పూర్తి సౌకర్యాలతో క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఎండీ ఆదేశించారు. 

మరిన్ని వార్తలు