సింగరేణికి రూ.993 కోట్ల లాభం

4 Oct, 2020 12:39 IST|Sakshi

సాక్షి, శ్రీరాంపూర్‌: సింగరేణి కంపెనీ 2019–20లో రూ.993 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో యాజమాన్యం అధికారికంగా పేర్కొన్నట్లు గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు బి.వెంకట్రావు శనివారం ‘సాక్షి’కి తెలిపారు. దీంతోపాటు తాము పలుమార్లు యాజమాన్యంతో చర్చించిన అంశాలపైనా బోర్డులో నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కంపెనీకి వచ్చిన లాభాల నుంచి కార్మికులకు వాటా ఇవ్వడం ఆనవాయితీ అని, ఇందుకోసం తమ యూనియన్‌ నేతలు, యూనియన్‌ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి త్వరలో ముఖ్యమంత్రితో బేటీ అయ్యి దసరా పండుగకు ముందే లాభాల వాటాను ఇవ్వాలని కోరుతామన్నారు.

కోవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కరోనాతో మార్చి నెలలో కార్మికులకు కోత విధించిన వేతనాలను అక్టోబర్‌ 23న చెల్లించనున్నారని తెలిపారు. దీనిపై హర్షం ప్రకటిస్తున్నట్లు యూనియన్‌ బ్రాంచీ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, కేంద్ర డెప్యూటీ ప్రధానకార్యదర్శి డి.అన్నయ్య, రీజియన్‌ సెక్రెటరీ మంద మల్లారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు