సింగరేణిలో ఉద్యోగాలు; హైకోర్టు కీల​క ఆదేశాలు

11 Feb, 2021 19:22 IST|Sakshi

పురుష అభ్యర్థుల దరఖాస్తులూ తీసుకోండి 

జూనియర్‌ స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీలో సింగరేణికి హైకోర్టు ఆదేశం

మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన ఉన్నత న్యాయస్థానం

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి కాలరీస్‌ ఆధ్వర్యంలో నియామకం చేపట్టనున్న జూనియర్‌ స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు నిర్ణీత అర్హతలున్న పురుష అభ్యర్థుల దరఖాస్తులను కూడా స్వీకరించాలని సింగరేణి కాలరీస్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిన నేపథ్యంలో దరఖాస్తులు సమర్పించేందుకు గడువు పెంచాలని స్పష్టం చేసింది. ఈ నియామకాలన్నీ కూడా తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.

జూనియర్‌ స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నారని, ఇది రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకు విఘాతమంటూ సింగరేణి ఉద్యోగి మహ్మద్‌ ఫసియుద్దీన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించేలా ఆదేశించాలని, ఈ మేరకు పలు సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

మహిళలు మాత్రమే అర్హులంటూ సింగరేణి కాలరీస్‌ విధానపరమైన నిర్ణయమేమీ తీసుకోకపోయినా గత కొన్నేళ్లుగా మహిళా అభ్యర్థులతోనే ఈ పోస్టులను భర్తీ చేయడం సంప్రదాయంగా వస్తోందని సింగరేణి తరఫు న్యాయవాది వివరించారు. ఈ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. విధానపరమైన నిర్ణయం తీసుకోనప్పుడు పురుష అభ్యర్థులు కూడా ఆ పోస్టులకు అర్హులేనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

చదవండి:
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌; తపాలాశాఖలో ఉద్యోగాలు

బెల్‌లో 16 ట్రెయినీ ఇంజనీర్‌ పోస్టులు

మరిన్ని వార్తలు