రాష్ట్రంలో అతి పెద్ద పరిశ్రమగా సింగరేణి  

3 Jun, 2022 02:15 IST|Sakshi

సింగరేణి సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పరిశ్రమగా ఉన్న సింగరేణి ఇప్పటికే తగినంత బొగ్గు, విద్యుత్‌ అందిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని, రాష్ట్రంలోనే కాక దేశంలోనే అత్యుత్తమ వృద్ధి నమోదు చేస్తున్న ప్రభుత్వ సంస్థల్లో ఒకటిగా నిలుస్తోందని సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ పేర్కొన్నారు. సింగరేణి భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రానున్న ఐదేళ్లలో 100 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 3 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధన దిశగా కృషి చేయనున్నామన్నారు. గత ఎనిమిదేళ్లలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, అమ్మకాలలో అత్యద్భుత వృద్ధిని నమోదు చేసి దేశంలో గల నవరత్న కంపెనీలకు దీటుగా నిలబడిందని పేర్కొన్నారు.

2014తో పోల్చితే నాడు 50 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన కంపెనీ గత ఆర్థిక ఏడాది రికార్డు స్థాయిలో 65 మిలియన్‌ టన్నులను ఉత్పత్తి చేసిందని, నాడు రూ.11 వేల కోట్ల టర్నోవర్‌ ఉండగా అది గతేడాది రూ.26 వేల కోట్లకు పెరిగిందని, లాభాలు కూడా గణనీయంగా పెరిగాయని, ఈ అభివృద్ధి ప్రస్థానాన్ని ఇలాగే కొనసాగించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.   

మరిన్ని వార్తలు