వడ్లు వేయొద్దన్నరు.. ఇప్పుడేమి కొంటున్నరు

23 Apr, 2022 03:32 IST|Sakshi
అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ను నిలదీస్తున్న ఆవునూర్‌ రైతులు 

అదనపు కలెక్టర్‌ను నిలదీసిన రైతులు 

ముస్తాబాద్‌ (సిరిసిల్ల): పోయిన సీజన్‌లో దొడ్డు వడ్లు వేయొద్దన్నరు.. యాసంగిలో వరి పెడితే ఉరేనని భయపెట్టిండ్రు.. ఇప్పుడేమి వడ్ల కొంటున్నరు.. ప్రభుత్వం కొనదేమోనని ముందుగా రైస్‌ మిల్లులకు తక్కువ ధరకు అమ్మి నష్టపోయినం.. మా పరిస్థితి ఏంటి.. అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం ఆవునూర్‌ గ్రామ రైతులు అడిషనల్‌ కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ను నిలదీశారు. ఆవునూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం చేందుకు శుక్రవారం గ్రామానికి వచ్చిన అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌కు ఈ అనుభవం ఎదురైంది.

వరి వేయొద్దని ఆవునూర్‌ రైతు వేదికలోనే కలెక్టర్‌ చెప్పడంతో గ్రామంలో చాలా మంది రైతులు వరి వేయలేదని రైతులు వాపోయారు. కొందరే మో బీడు భూములు ఉంచడం ఇష్టం లేక వరి పండించి.. ఎవరూ కొనమంటే రైస్‌మిల్లులకు తక్కువ ధరలకే అమ్ముకున్నామన్నారు. దీనిపై అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తామన్నారు. ఆవునూర్‌లో పంట కోతలు ముందుగా వస్తాయని.. ఎందరు రైతులు మిల్లర్లకు విక్రయించారో విచారణ జరిపి వారికి మద్దతు ధర ఇప్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.  

మరిన్ని వార్తలు