సచివాలయ వ్యర్థాలు 62వేల మెట్రిక్‌ టన్నులు

2 Aug, 2020 03:23 IST|Sakshi
టార్పాలిన్లు కప్పి లారీల్లో తరలిస్తున్న సచివాలయ భవనం వ్యర్థాలు 

మొత్తం 2 లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు వెలువడతాయని అంచనా

సచివాలయ కూల్చివేతల మెటీరియల్‌ జీడిమెట్ల ప్లాంట్‌కు తరలింపు

సాక్షి, హైదరాబాద్‌: సచివాలయ కూల్చివేతల వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసి పునర్వినియోగించనున్నారు. అందుకుగాను జీడిమెట్లలోని కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డిమాలిషన్‌ (సీఅండ్‌డీ) వ్యర్థాల రీసైక్లింగ్‌ ప్లాంట్‌కు తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు జూలై 20 నుంచి 31వ తేదీ వరకు 62 వేల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను తరలించా రు. మొత్తం 2 లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు వెలువడుతాయని అంచనా. కూల్చివేతల వ్యర్థాల తరలింపు సక్రమంగా జరుగుతున్నదీ లేని దీ జీహెచ్‌ఎంసీ అధికారులు నిత్యం పరిశీలి స్తున్నారు. కమిషనర్‌ ఆదేశాలకనుగుణంగా సంబంధిత అడిషనల్‌ కమిషనర్, ఇంజనీర్లు పరిశీలిస్తున్నారు. తరలింపు సందర్భంగా వాహనాలపై టార్పాలిన్లు కప్పడం, రహదారులపై వ్యర్థాలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటివి సూచిస్తున్నారు.

స్టీల్, వుడ్‌ వంటివి తరలింపునకు ముందే కూల్చివేతల ప్రాంతంలోనే వేరు చేస్తుండగా, జీడిమెట్లలోని ప్లాంట్‌కు తరలించాక కాంక్రీట్‌లో స్టీల్, తదితరమైనవి ఏవైనా ఉంటే వేరు చేస్తున్నారు. నగరంలో నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఉండేందుకు జీహెచ్‌ఎంసీ జీడిమెట్లలో రీసైక్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రాంకీ సంస్థకు అనుమతినిచ్చింది. ప్రస్తుత చార్జీల మేరకు మెట్రిక్‌ టన్నుకు రూ.367లు. ఈ లెక్కన రెండు లక్షల మెట్రిక్‌ టన్నులకు రూ.7 కోట్లకు పైగా కాంట్రాక్టు సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు వంద వాహనాలను వ్యర్థాల తరలింపునకు వినియోగిస్తుండగా, ఇప్పటివరకు 2,700 ట్రిప్పుల మేర తరలించినట్లు సమాచారం. ఈ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసి ఇటుకలు, కెర్బ్‌లు, ఇసుక వంటివి తయారు చేస్తారు.

మరిన్ని వార్తలు