కార్పెంటర్‌ షాప్‌లో అస్థిపంజరం

11 Feb, 2021 07:49 IST|Sakshi
కార్పెంటర్‌ షాపులోని పెట్టెలో బయటపడ్డ అస్తిపంజరం

హైదరాబాద్‌లో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన 

షాప్‌ నిర్వాహకుడిపై అనుమానం 

అమీర్‌పేట(హైదరాబాద్‌): బోరబండ ఇందిరానగర్‌ ఫేజ్‌–2లో బుధవారం దారుణ సంఘటన వెలుగుచూసింది. కార్పెంటర్‌ షాపులో ఓ వ్యక్తి అస్థి పంజరం బయటపడింది. షాపు యజమానే ఎవరినో హత్య చేసి పెట్టెలో పెట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలాష్‌ పాల్‌ అనే వ్యక్తి గాయత్రీనగర్‌లో ఉంటూ కార్పెంటర్‌గా పనిచేసేవాడు. ఇందిరానగర్‌లోని కనకదుర్గా భవానీ, షిరిడీ సాయిబాబా ఆలయం కింద ఉన్న సెల్లార్‌ను 2017లో అద్దెకు తీసుకుని కార్పెంటర్‌ షాపు నిర్వహిస్తున్నాడు. సంవత్సరంపాటు ప్రతినెలా అద్దెను చెల్లిస్తూ వచ్చిన పాల్‌ ఆ తరువాత వాటిని సకాలంలో ఇవ్వడం లేదు.

పాల్‌ ప్రతినెలా అద్దె ఇవ్వని కారణంగా షాపు ఖాళీ చేయించాలన్న నిర్ణయానికి వచ్చి రెండురోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మంగళవారం వచ్చి ట్రస్టు సభ్యుల సమక్షంలో షాపు తాళాలు తెరిచి అందులోని సామాన్లను ఓ చోట భద్రపరిచాలని సూచించారు. అనంతరం గోవర్ధన్‌ అనే వ్యక్తికి షాపును అద్దెకు ఇచ్చారు. బుధవారం ఉదయం షాపులో ఓ పక్కకు కనిపించిన పెట్టెను గోవర్ధన్‌ తెరిచి చూడగా అస్థిపంజరం బటయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి వచ్చి పెట్టెలోని  అస్థిపంజరాన్ని బయటకుతీశారు. హత్యకు గురైన వ్యక్తి ఎవరన్నది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కార్పెంటర్‌ పలాష్‌ పాల్‌కు ఓ మహిళతో అక్రమ సంబంధం ఉండేదని తెలుస్తోంది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.  

మరిన్ని వార్తలు