ఆకాశవీధిలో...  

4 Jan, 2021 01:07 IST|Sakshi

రహేజా మైండ్‌ స్పేస్‌లో స్కై వాక్‌ వే 

మెట్రోస్టేషన్‌కు అనుసంధానం 

ఐటీ ఉద్యోగులు స్కై వాక్‌ చేస్తూ కార్యాలయాలకు వెళ్లొచ్చు 

రూ. 100 కోట్లతో స్కై వాక్‌ వే పనులను చేపడుతున్న రహేజా గ్రూపు

సాక్షి, గచ్చిబౌలి(హైదరాబాద్‌): ఐటీ ఉద్యోగుల ప్రయాణపు వెతలు ఇక తీరనున్నాయి. హైటెక్‌ సిటీ రాయదుర్గం మెట్రోస్టేషన్‌కు అనుసంధానంచేస్తూ రూ.100 కోట్ల వ్యయంతో రహేజాగ్రూపు సంస్థ మైండ్‌ స్పేస్‌లో నిర్మిస్తోన్న ‘స్కై వాక్‌ వే’పనులు శరవేగంగా సాగుతున్నాయి. నగరానికే ఐకాన్‌గా నిలవనున్న ఈ ‘స్కై వాక్‌ వే’ను మెట్రోస్టేషన్‌ నుంచి 1.2 కిలోమీటర్ల వరకు చేపడుతున్నారు. స్టేషన్‌ నుంచి మైండ్‌ స్పేస్‌ ప్రధాన ద్వారం వెంట నేరుగా మొదటి జంక్షన్లో స్కై సర్కిల్‌ ఏర్పాటు చేస్తున్నారు.

అటు నుంచి స్కై వాక్‌ వేను కొనసాగిస్తూ వెస్టిన్‌ హోటల్‌ సమీపంలో ఉన్న మరో జంక్షన్‌లో ‘స్కై వాక్‌ వే’సర్కిల్‌ను నెలకొల్పారు. నడుచుకుంటూ ఆయా టవర్ల వద్దకు వెళ్లే విధంగా ఎగ్జిట్‌ ఇస్తున్నారు. రాత్రి సమయంలోనూ వెళ్లేందుకు లైటింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఐటీ ఉద్యోగులు ఎలాంటి అవాంతరాలు లేకుండా ‘స్కై వాక్‌’చేస్తూ పనిచేసే టవర్లకు నేరుగా వెళ్లవచ్చు. మరికొద్ది నెలల్లోనే ఈ ‘స్కై వాక్‌ వే’అందుబాటులోకి రానుంది.  

ఒకేచోట అన్నీ..
రహేజా గ్రూపునకు మాదాపూర్‌లో 110 ఎకరాల స్థలాన్ని 2004 అప్పటి ఏపీఐఐసీ కేటాయించింది. రహేజా గ్రూపు మొదటిసారిగా నగరంలో మైండ్‌ స్పేస్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ను నెలకొల్పింది. ఫస్ట్‌ అండ్‌ లార్జెస్ట్‌ ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ గోల్డ్‌ రేటింగ్‌ క్యాంపస్‌గా గుర్తింపు పొందింది. రెయిన్‌ వాటర్‌ సిస్టమ్, సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, సోలార్‌ ప్యానెల్స్‌ మెయింటెనెన్స్, నాలుగు ఎకరాల రిజర్వ్‌ గ్రీన్‌ ఏరియా, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్, టెన్నిస్‌ కోర్టు, 3,500 చెట్లు రహేజా మైండ్‌ స్పేస్‌ ఆవరణలో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు