తెలంగాణ సచివాలయంలో నాగుపాము కలకలం

3 Mar, 2021 08:42 IST|Sakshi

సాక్షి, హైదరబాద్‌: గ్రేటర్‌ నగరంలో విష సర్పాలు బుసలు కొడుతున్నాయి. విస్తరిస్తోన్న కాంక్రీట్‌ జంగిల్, చెట్ల నరికివేత..బ్లాస్టింగ్‌..తదితర అభివృద్ధి ప్రక్రియలతో విషసర్పాలకు ఆవాస సమస్య తలెత్తి పుట్టల్లోంచి బయటకు వస్తున్నాయి. బహుళ అంతస్తుల భవంతులు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు వెలుస్తుండడంతో పాముల మనుగడ కూడా ప్రశ్నార్థకమౌతోంది. గతేడాదిగా  ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్‌ సొసైటీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 వేల పాములను సంరక్షించారు.

వీటిలో సుమారు 4 వేల వరకు గ్రేటర్‌ పరిధిలోనివే కావడం గమనార్హం. ఇందులోనూ 60 శాతం విషసర్పాలున్నాయి. కాగా మంగళవారం సచివాలయం (బీఆర్కే భవన్‌)లో ఒక నాగుపాము కనిపించడంతో కలకలం మొదలైంది. ఉద్యోగులు ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్‌ సొసైటీకి సమాచారం అందించారు. సొసైటీ సభ్యులు అక్కడికి చేరుకునేలోగానే  పాము భవన్‌ సమీపంలో ఉన్న కలుగులో నుంచి వెళ్లిపోయిందని..దానిని పట్టుకోవడం సాధ్యపడలేదని స్నేక్‌ సొసైటీ కార్యదర్శి అవినాష్‌ ‘సాక్షి’కి తెలిపారు. 

పాముల జాగాలో మనుషుల ఆవాసాలు.. 
ఒకప్పుడు  పాములు మనుగడ సాగించిన ప్రాంతాల్లో ఇప్పుడు బహుళ అంతస్తుల భవంతులు..గేటెడ్‌ కమ్యూనిటీలు వెలుస్తుండడంతో పాముల సహజసిద్ధమైన ఆవాసాలు దెబ్బతింటున్నాయి.  
ప్రధాన నగరంలోని జూబ్లీహిల్స్‌తోపాటు శివార్లలోని గచ్చిబౌలి, కొండాపూర్, అత్తాపూర్, నార్సింగి, కోకాపేట్, నెక్నాంపూర్, లింగంపల్లి, కూకట్‌పల్లి, ఉప్పల్, వనస్థలిపురం, సాగర్‌రింగ్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో పాముల సంఖ్య పెరిగింది.  
వీటిలో విషసర్పాలుగా పేరొందిన నాగుపాము లు, స్పెక్టకిల్డ్‌ కోబ్రా, రస్సెల్‌ వైపర్, కామన్‌ కైరా ట్, స్కా స్కేల్డ్‌ వైపర్‌ వంటి విషసర్పాలే అధికం.  
జనావాసాల్లోకి పాములు వస్తే 8374233366 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి అవినాష్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు