సాఫ్ట్‌వేర్‌ తొందరపాటు నిర్ణయం.. ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని..

19 Mar, 2023 07:55 IST|Sakshi
అఖిల్‌(ఫైల్‌)

సాక్షి, మియాపూర్‌: ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని, తన నంబర్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టిందని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నాగేశ్వర్‌రావు వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్‌ మండలం ఆరూర్‌ గ్రామానికి చెందిన చెల్మెడ అఖిల్‌(28) పటాన్‌చెరులోని శ్రీనగర్‌కాలనీలో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు.

ఈ నెల 16న చందానగర్‌లోని ఓయో హోటల్‌లో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉన్నాడు. మరుసటి రోజు ఎంతకూ అఖిల్‌ బయటకు రాకపోవడంతో యాజమాన్యం కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గదిలో పరిశీలించగా అతడి మెయిల్‌లో ఓ సూసైడ్‌ నోట్‌ను గుర్తించారు.

అందులో ‘ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని.. గత కొన్ని రోజులుగా తనతో మాట్లాడకుండా తన ఫోన్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టిందని.. అందుకే సూసైడ్‌ చేసుకుంటున్నానని.. రాసి ఉంది. మృతుడి సోదరుడు ప్రశాంత్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు