పదేళ్లకు చేరిన తల్లి.. దుఃఖాన్ని ఆపుకోలేక కుమారుడు

24 Apr, 2021 04:53 IST|Sakshi

పదేళ్లకు కొడుకు చెంతకు తల్లి

అన్నం ఫౌండేషన్‌ సహకారంతో స్వగ్రామానికి..

భద్రాచలం ఏఎస్పీ సమక్షంలో అప్పగింత

భద్రాచలం: మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళ పదేళ్ల తర్వాత కొడుకు చెంతకు చేరింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళ భద్రాచలంలో రోడ్లు, డివైడర్ల మీద నివాసం ఉంటూ కాలం వెళ్లదీసేది. పదేళ్లుగా ఇలా జీవనం సాగిస్తున్న ఆమెపై పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి ఖమ్మంకు చెందిన అన్నం ఫౌండేషన్‌ చైర్మన్, పారా లీగల్‌ వలంటీర్‌ డాక్టర్‌ అన్నం శ్రీనివాస్‌రావు చేరదీసి 2019లో ఖమ్మంలోని తన ఆశ్రమంలో చేర్పించారు. వసతితోపాటు చికిత్స అందించారు.

ఆమె పరిస్థితి మెరుగైన తర్వాత కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. తన పేరు శాంతిదేవి అని, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బాంద్రా జిల్లా అర్బయ గ్రామమని తెలిపింది. దీంతో శ్రీనివాస్‌రావు ఇంటర్‌నెట్‌ ద్వారా ఆ గ్రామ సమాచారం తెలుసుకొని అక్కడి పోలీసులకు వివరాలందించారు. పెద్ద కొడుకు దినేశ్‌ ఆచూకీ తెలుసుకొని తల్లికి వీడియో కాల్‌ చేయించారు. ఆమె తన తల్లి అని దినేశ్‌ ధ్రువీకరించాడు. దీంతో శ్రీనివాసరావు.. శాంతిదేవిని శుక్రవారం భద్రాచలం ఏఎస్పీ డాక్టర్‌ వినీత్‌ ఆధ్వర్యంలో దినేశ్‌కు అప్పగించారు. తల్లిని స్వగ్రామానికి తీసుకెళ్లాడు.

చదవండి: వినూత్నం.. ఎంపీ, ఎమ్మెల్సీ గుర్రమెక్కి మరీ..
చదవండి: తెలంగాణ ఆదర్శం: వాయువేగాన ఆక్సిజన్‌

మరిన్ని వార్తలు