కన్నతల్లి బరువైంది.. రెండు రోజులుగా ఆహారంలేక

21 Jun, 2021 07:19 IST|Sakshi

కొడంగల్‌: పేగు తెంచుకుని పుట్టిన కొడుకులు తమ కన్నతల్లిని రోడ్డుపై వదిలేశారు. రెండు రోజులుగా ఆహారం లేక, చలికి వణుకుతూ ఆ వృద్ధురాలు అపస్మారక స్థితికి చేరుకుంది. ఈ హృదయ విదారక ఘటన వికారాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కోస్గి మండలం కడంపల్లి గ్రామానికి చెందిన 80 ఏళ్ల మహిళను ఆమె కుమారులు రెండు రోజులక్రితం కొడంగల్‌ బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిపోయారు. దీంతో అందరూ ఉండి కూడా ఆమె అనాథలా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బస్టాండ్‌లోని వ్యాపారులు, పరిసర వాసులు ఆమెకు రెండు రోజులు తిండి పెట్టారు.

ఆదివారం ఉదయం ఆరోగ్యం క్షీణించడంతో బస్టాండ్‌లోకి తరలించారు. ఆ వృద్ధురాలికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె దయనీయ పరిస్థితిని గమనించిన కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి స్పందించారు. సోమవారం ఉదయం ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని ఆయన తెలిపారు. 
చదవండి: చిట్టి తల్లికి.. పెద్ద కష్టం

మరిన్ని వార్తలు