‘అడ్వాన్స్‌డ్‌’కు ప్రత్యేక పోర్టల్‌ 

13 Sep, 2020 03:46 IST|Sakshi

రెండు జేఈఈల్లో టాప్‌స్కోరే అడ్వాన్స్‌డ్‌కు అర్హత 

దాని ఆధారంగానే కటాఫ్‌ ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌కు ప్రత్యేక పోర్టల్‌ను ఢిల్లీ ఐఐటీ అందుబాటులోకి తీసుకువచ్చింది. అడ్వాన్స్‌డ్‌ నోటిఫికేషన్, అర్హత వివరాలను పొందుపరిచిన వెబ్‌సైట్‌ (htt pr://jeeadv.ac.in) కాకుండా జేఈఈ మెయిన్‌ అర్హత సాధించిన విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు మరో వెబ్‌సైట్‌ను (jeeadv.inc.in) దుబాటులోకి తెచ్చింది. అర్హతలకు సంబంధించిన వివరాలన్నింటిని పాత వెబ్‌సైట్‌లోనే(అఫీషియల్‌) ఉంచింది. ఆ వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో దరఖాస్తుల మొదటిరోజు విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.దీంతో వెంటనే మరో వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. విద్యార్థులు ఈ వెబ్‌సైట్‌ (jeeadv.nic.in)  ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించింది. ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు రిజిస్ట్రేషన్‌కు, 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 27న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా మెయిన్‌లో టాప్‌ 2.5 లక్షల మంది బెస్ట్‌ స్కోర్‌ విద్యార్థులనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.

విద్యార్థులకు జనవరి జేఈఈ మెయిన్‌లో వచ్చిన స్కోర్, ప్రస్తుత జేఈఈ మెయిన్‌లో వచ్చిన స్కోర్‌ రెండింటిలో ఏది బెస్ట్‌ అయితే దాన్నే అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఆ మేరకు కేటగిరీల కటాఫ్‌ స్కోర్‌ను శుక్రవారంరాత్రే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రకటించింది. ఆయా స్కోర్‌ పరిధిలో ఉన్న విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టింది. జనవరి, సెప్టెంబర్‌ జేఈఈ మెయిన్‌లకు 11.23 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 10.23 లక్షల మంది పరీక్ష రాసినట్లు వెల్లడించింది. వీరిలో టాప్‌ 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈసారి జేఈఈ మెయిన్‌కు హాజరైన బాలికల సంఖ్య పెరిగింది. దాదాపు 30 శాతం(3.08 లక్షల) మంది జేఈఈ మెయిన్‌ కు హాజరయ్యారు. అలాగే ఐఐటీల్లో బాలికల సంఖ్యను పెంచేందుకు 2021 సంవత్సరం వరకు సీట్లను పెంచుతూ వస్తున్న కేంద్రం.. ఈసారి కూడా 20 శాతం సూపర్‌న్యూమరరీ సీట్లను కేటాయించనుంది. కాగా, విద్యార్థులకు వచ్చిన ఫైనల్‌ స్కోర్‌ ఆధారంగా ఎన్‌టీఏ జేఈఈ మెయిన్‌ ర్యాంకులను కేటాయించింది. ఈ ర్యాంకుల ఆధారంగానే ఎన్‌ఐటీ, ఐఐఐటీ, గవర్నమెంట్‌ ఫండెడ్‌ టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (జీఎఫ్‌టీఐ)ల్లో ప్రవేశాలు జరపనుంది. 

మరిన్ని వార్తలు