రూ.5కేనాలుగు ఇడ్లీలు.. అక్కడ ఫుల్‌ డిమాండ్‌.. దీనికో ప్రత్యేకత ఉంది

26 Dec, 2021 09:25 IST|Sakshi

సాక్షి,మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లా జైలు ఆధ్వర్యంలో ఖైదీలు తయారు చేసి విక్రయిస్తున్న రూ.5లకే నాలుగు ఇడ్లీలకు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. పట్టణంలో వీటిని రుచి చూడాలని ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. కరోనా వల్ల కొన్ని రోజులు మూసివేసినా.. రెండేళ్లుగా విజయవంతంగా కొనసాగుతుంది. జిల్లా జైలు ఆధ్వర్యంలో 2019 అక్టోబర్‌ 15న రూ.5లకే నాలుగు ఇడ్లీలు అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు. ప్రస్తుత పరిస్థితిలలో రూ.ఐదుతో ఏం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కనీసం తాగడానికి టీ కూడా రావడం లేదు. దీంతో జిల్లా జైలు అధికారులు వినూత్నంగా ఆలోచించి రూ.ఐదుకే నాలుగు ఇడ్లీలు ఇస్తుండడంతో ఆదరణ బాగా పెరిగింది.  

జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో ఇడ్లీలు తయారు చేయిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతి రోజూ 250 ప్లేట్ల ఇడ్లీలను విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే రుచికరమైన ఇడ్లీలు ఇస్తుండడంతో చుట్టు పక్కల వారితో పాటు ప్రధాన రోడ్డు వెంట ప్రయాణం చేసే వారు ఇక్కడే టిఫిన్‌ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా పర్సిల్‌ తీసుకుపోతే రూ.6 చెల్లించాల్సి ఉంటుంది.  

రోజూ ఇక్కడే టిఫిన్‌.. 
మా ఇంట్లో ఐదుగురం ఉన్నాం. రోజు ఇక్కడి నుంచే ఆరు ప్లేట్ల ఇడ్లీ తీసుకువెళ్తాను. రూ.30లకు కుటుంబం మొత్తం ఒక్క పూట తినవచ్చు. ఆదివారం మినహాయించి ప్రతి రోజూ ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను. రూ.5లకే బయట హోటళ్లలో లభించే విధంగా రుచికరంగా ఉంటుంది.  
– యాదిన్‌లాల్, బండ్లగేరి 

ఈ మార్గంలో వెళ్తే.. 
ఈ కాలంలో ఐదు రూపాయలకు ఏం వస్తుంది. ఇక్కడ మాత్రం ఒక పూట కడుపు నిండుతుంది. జైలువాళ్లు తక్కు వ రేటుకే ఇస్తున్నా రు. అందుకే చాలామంది పేదోళ్లు ఇక్కడే తింటారు. నేను ఈ రోడ్డు మార్గంలో వెళ్లిన ప్రతిసారి ఇడ్లీలు తింటాను. రూ.10 ఉంటేతో రెండే పేట్ల ఇడ్లీ తింటా.
– చెన్నయ్య, ఆటోడ్రైవర్, నవాబ్‌పేట

రుచికరంగా ఉంది..       
మార్కెట్‌లో ఐదు రూపాయలకు చాయ కూడా వస్తలే దు. ఇక్కడ నాలుగు ఇడ్లీలు ఇస్తున్నారు. సమయం ఉన్న ప్రతి సారి ఇక్కడి నుంచే ఇంటికి ఇడ్లీలు తీసుకువెళ్తాను. బయట హోటళ్లలో రూ.30 వెచ్చించే బదులు అదే రుచికరమైన ఇడ్లీ రూ.5లతో తినొచ్చు.  
– శేఖర్, పాన్‌చౌరస్తా 

సింగిల్‌ టీ రావడం లేదు.. 
నేను ఆటో తీసుకుని రోడ్డు మీదకు వస్తే తప్పకుండా జైలు దగ్గర ఇడ్లీ తింటా ను. ప్రతిసారి రూ. 10లు ఇచ్చి రెండు ప్లేట్లు తీసుకుని తింటా. రోడ్డుమీద సింగిల్‌ టీ కూడా ఇవ్వడం లేదు, కానీ అదే పది రూపాయలతో ఒకపూట తింటాను.  
– రాజు, ఆటోడ్రైవర్, పుట్నలబట్టి 

చదవండి: Hyderabad: కొడుకులే పెద్దలుగా మారి.. పెళ్లైన 25 ఏళ్లకు మళ్లీ పెళ్లి..!

మరిన్ని వార్తలు