శ్రీశైలం ప్రమాదం: సీఐడీకి కేసు బదిలీ

22 Aug, 2020 12:36 IST|Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: శ్రీశైలం పవర్‌హౌజ్‌ ప్రమాదంపై సీఐడీ చీఫ్ గోవింద్‌సింగ్ విచారణ కొనసాగుతోంది. శ్రీశైలం పవర్‌హౌజ్‌ ప్రమాదంపై విచారణకు నాలుగు బృందాలు ఎలక్ట్రికల్, ఫోరెన్సిక్‌ సైన్స్, సీఐడీ, లోకల్ పోలీసుల టీమ్‌లు‌ ఏర్పాటు చేశారు. కాగా, ప్రమాద ఘటనపై ఈగలపెంట పోలీస్ స్టేషన్‌లో 174 సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈ కేసు సీఐడీకి బదిలీ అయింది. శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

మరో 8 మంది గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సీఐడీ విచారణకు ఆదేశించారు. దుర్ఘటనకు దారి తీసిన పరిస్థితులు, ప్రమాదానికి గల కారణాలను వెలికితీయాలని స్పష్టంచేశారు. సీఎం ఆదేశాల మేరకు సీఐడీ అదనపు డీజీపీ గోవింద్‌ సింగ్‌ను విచారణ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.
(చదవండి: కాంగ్రెస్‌ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత)
(చదవండి: మృత్యుసొరంగం)

మరిన్ని వార్తలు