టెన్త్‌ మోడల్‌ పేపర్లు విడుదల

30 Dec, 2022 01:27 IST|Sakshi

వెబ్‌సైట్‌లో అందుబాటులోకి..

సాక్షి, హైదరాబాద్‌: ఏప్రిల్‌ 3 నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన మోడల్‌ పేపర్లను ఎస్సెస్సీ పరీక్షల విభాగం గురువారం విడుదల చేసింది. వందశాతం సిలబస్‌ నుంచి వీటిని రూపొందించారు. కోవిడ్‌ తర్వాత ఈ తరహా పరీక్ష జరపడం ఇదే మొదటిసారి. 2020లో 3 సబ్జెక్టులు నిర్వహించిన తర్వాత కోవిడ్‌ ఉధృతి దృష్ట్యా పరీక్షలను వాయిదా వేశారు. 2021లో అసలు పరీక్షలే నిర్వహించలే దు. 2022లో పరీక్షలు పెట్టినా 70 శాతం సిలబస్‌నే అమలు చేశారు.

మూడేళ్ల తర్వాత పూర్తిస్థాయి సిలబస్‌తో నిర్వహించనున్నారు. దీంతో టెన్త్‌ పరీక్షల విధానం పూర్తిగా అర్థమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు పాఠశాలల యాజమాన్యాలకు సూచించారు. వంద శాతం ఫలితాలు సాధించే దిశగా కృషి చేసేందుకు ఇదే సరై న మార్గమని అభిప్రాయపడుతున్నారు. గతంలో పరీక్షలను 11 పేపర్లతో నిర్వహించగా, ఇప్పుడు 6 పేపర్లకు కుదించారు.

ఇది కూడా కొత్త విధానం కావడంతో అవగా హన కల్పించాలని హెచ్‌ఎంలకు పాఠశాల విద్యాశాఖ సూచించింది. డిసెంబర్‌ కల్లా సిలబస్‌ పూర్తి చేసి, జనవరిలో రివిజన్‌ చేపట్టడంతోపాటు, బోర్డు విడుదల చేసిన మోడల్‌ పేపర్లతో విద్యార్థులను సన్నద్ధం చేయాలని చెప్పింది. ఏయే చాప్టర్ల నుంచి ఏ తరహా ప్రశ్నలు రావొచ్చు, మార్కులు ఎలా ఉంటాయనే వివరాలను, మోడల్‌ పేపర్లను బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వీటిని అనుసరిస్తే మంచి మార్కులు సాధించవచ్చని అధికారులు అంటున్నారు. 

>
మరిన్ని వార్తలు