మూడు రోజుల్లో లండన్‌కు అంతలోనే మృత్యుఒడికి 

27 Nov, 2022 01:40 IST|Sakshi

విద్యుదాఘాతంతో విద్యార్థి దుర్మరణం

లండన్‌ నుంచి ఇటీవలే స్వగ్రామానికి వచ్చిన మురళీగౌడ్‌

నల్లగొండ జిల్లాలో విషాదం

నల్లగొండ క్రైం: విద్యుదాఘాతం ఓ విద్యార్థిని బలి గొంది. నల్లగొండ జిల్లాలోని నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లి గ్రామ మాజీ సర్పంచ్‌ చింతల వెంకటేశంగౌడ్‌ కు మారుడు మురళీ గౌడ్‌(24) లండన్‌లో ఎంఎస్‌ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇటీవలే మురళీ స్వగ్రామానికి వచ్చాడు. కుమారుడికి ఉద్యోగం రాగానే వివాహం చేయా లని నిర్ణయించిన తల్లిదండ్రులు, అందుకోసం ఇంటి పైభాగంలో నిర్మాణ పనులు చేయిస్తున్నారు.

పనుల్లో భాగంగా మురళి శనివారం ఉదయం ఇంటిపైన ఉన్న ఇనుప చువ్వల ను కిందికి విసురుతుండగా పక్కనుంచే వెళ్తున్న 11కేవీ విద్యు త్‌ వైరుకు ఒక ఇనుప చువ్వ తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే కుప్పకూలాడు. ఇది గమనించిన తండ్రి వైరును పక్కకు తొలగించి మురళిని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.  

మూడు రోజుల్లో లండన్‌కు.. 
వెంకటేశం కుమారుడు మురళి చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ కుమారుడిని చదివించారు. లండన్‌లో ఎంఎస్‌ కోర్సు పూర్తికావడంతో కొద్ది రోజులు కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. మరో మూడు రోజుల్లో లండన్‌కు తిరిగి వెళ్లాల్సి ఉండగా ఈ విషాదకర ఘటన చోటు చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పరామర్శించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫోన్‌లో మురళి కుటుంబ సభ్యులతో మాట్లాడి సంతాపం తెలిపారు. 

మరిన్ని వార్తలు