దాగుడుమూతలు ఆడుకుంటుండగా..

17 Jun, 2022 01:30 IST|Sakshi
రాజేశ్వరి

సంగెం: పాఠశాల చివరి పిరియడ్‌లో దాగుడు మూతలు ఆడుకుంటుండగా దాక్కోవడానికి వెళ్లిన ఓ విద్యార్థిని కరెంట్‌ షాక్‌కు గురై మృతిచెందింది. వరంగల్‌ జిల్లా సంగెం మండలం తిమ్మాపూర్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా రామ చంద్రాపురానికి చెందిన లింగాల సంతోష్, అనూష భార్యాభర్తలు. బతుకుదెరువు కోసం సంతోష్‌ అత్తగారి ఊరైన తిమ్మాపూర్‌కు వచ్చి జీవిస్తున్నాడు.

వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్దకూతురు రాజేశ్వరి (11) ఆరో తరగతి, చిన్న కూతురు అక్షయ ఒకటో తరగతి చదువుతున్నారు. కొంత కాలం క్రితం సంతోష్‌ భార్యాపిల్లలను వదిలి వెళ్లిపోయాడు. దీంతో అనూష తల్లిగారి ఇంట్లోనే ఉంటూ పిల్లలిద్దరిని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నది. రోజుమాదిరిగానే రాజేశ్వరి పాఠశాలకు వెళ్లింది.

చివరి పిరియడ్‌లో రాజేశ్వరి సహా 10 మంది బాలికలు దాగుడు మూతలు ఆడుకుంటున్నారు. స్టాఫ్‌రూం వెనకాల దాక్కోవ డానికి వెళ్లిన రాజేశ్వరి, అక్కడ విద్యుత్‌ తీగలకు తగలడంతో షాక్‌కు గురై గిలగి లా కొట్టుకుంటుండగా ఓ విద్యార్థిని చూసి ఉపాధ్యాయులకు చెప్పింది. దీంతో రాజేశ్వరిని వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగానే బాలిక మృతిచెందింది.

మరిన్ని వార్తలు