అభిమాని లేఖకు మంత్రి హరీశ్‌ రావు ఫిదా.. ప్లాస్టిక్‌ బాటిల్‌ నీరు తాగొద్దని..

8 Oct, 2022 12:27 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: హరీశ్‌రావు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్య బాధ్యతలు చూసే కీలక మంత్రిగా ఉన్నారు. ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం కృషిచేస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు. ప్లాస్టిక్‌ వాడకంతో భయంకరమైన  కేన్సర్‌ బారినపడే ఆవకాశాలు ఉన్నాయని వారిని జాగృతం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో  మరో మార్గం లేక మంత్రి కూడా ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌  దప్పిక తీర్చుకొనే అత్యవసర పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని గుర్తించిన ఓ వీరాభిమాని అమాత్యుడు హరీశ్‌రావు ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలంటూ శుక్రవారం దుబ్బాక పర్యటనలో మంత్రికి లేఖ అందించారు.

మీ ఆరోగ్యమే మాకు మహాభాగ్యం..మీరు తప్పని పరిస్థితుల్లో ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌ వాడుతున్నారని, ఈ నీరు తాగడం వల్ల భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదన్నారు. ఇటీవల అంతర్జాతీయ ప్రముఖ రేడియాలజిస్టు డాక్టర్‌ విమల్‌ సోమేశ్వర్‌ ఇంటర్వ్యూలో చెప్పారని లేఖలో వివరించారు. దయచేసి ఇకపై కాపర్‌ వాటర్‌ బాటిల్‌ వినియోగించాలని మంత్రికి దుబ్బాక పరిధి మల్లాయపల్లికి చెందిన ఎంబీఏ విద్యార్థి కీసరి ప్రవీణ్‌ లేఖ అందించాడు. ప్రవీణ్‌ రాసినలేఖను చదివి తన ఆరోగ్యం పట్ల ఎంతో తపనతో రాశాడంటూ ఫిదా అయ్యాడు. ప్రవీణ్‌ కు మంత్రి ప్రత్యేకంగా ఫోన్‌ చేసి ధన్యవాదాలు తెలిపారు. సోషల్‌ మీడియాలో  లేఖ హల్‌చల్‌ అవుతోంది.  
చదవండి: చివరిశ్వాస వరకూ ‘అమ్మవారి’తోనే..

మరిన్ని వార్తలు