చార్మినార్‌ చెంతా ‘సండే– ఫన్‌డే’ సందడి

16 Oct, 2021 16:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరానికి మణిహారంలా నిలిచిన చార్మినార్‌ను సిటిజన్లకు మరింత చేరువ చేసేందుకు మున్సిపల్‌ పరిపాలన శాఖ చర్యలు చేపట్టింది. ప్రతీ ఆదివారం ‘సండే– ఫన్‌డే’లో భాగంగా ట్యాంక్‌బండ్‌పై కుటుంబ సమేతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో విహారానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన తరహాలోనే.. చార్మినార్‌ పరిసరాలు కూడా సిద్ధమవుతున్నాయి.


వాహనాల రణగొణ ధ్వనులు లేని వాతావరణంలో పాదచారులు చార్మినార్‌ చుట్టూ తిరుగుతూ.. చారిత్రక నిర్మాణాన్ని అమూలాగ్రం పరిశీలించే ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, నగర కొత్వాల్‌ అంజనీకుమార్‌లతో కలిసి  మున్సిపల్‌ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఏర్పాట్లను పరిశీలించారు. చారిత్రక కట్టడాలపై భవిష్యత్‌ తరాలకు కళ్లకు కట్టినట్లు వివరించాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన తెలిపారు. 

‘ఏక్‌ షామ్‌.. చార్మినార్‌కే నామ్‌’ పేరుతో ఈనెల 17న సాయంత్రం 5 గంటల నుంచి ‘సండే– ఫన్‌డే’ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ట్విటర్‌ ద్వారా అర్వింద్‌కుమార్‌ వెల్లడించారు. సందర్శకుల కోసం లాడ్‌ బజార్‌ అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటుందన్నారు. పోలీసు బ్యాండ్‌ మ్యూజిక్‌, ముషాయిరాలతో పాటు పిల్లల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మొక్కల ఉచిత పంపిణీ కూడా ఉంటుందని చెప్పారు.  

చదవండి: 18 నుంచి హైదరాబాద్‌ మెట్రో సువర్ణ ఆఫర్‌ 

మరిన్ని వార్తలు