టపాసులు కాల్చేందుకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌..

13 Nov, 2020 15:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో బాణసంచాను నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. టపాసుల నిషేధంపై సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరిస్తూ గ్రీన్‌ క్రాకర్స్‌కు అనుమతినిచ్చింది. ఎన్‌జీటీ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. దీపావళి రోజు 2 గంటలపాటు టపాసులు కాల్చుకునేందుకు అవకాశం కల్పించింది.  రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు అనుమతి మంజూరు చేసింది.  సుప్రీంకోర్టు తీర్పుతో బాణసంచా వ్యాపారులకు ఊరట లభించింది. కాగా కరోనా వైరస్‌ నేపథ్యంలో క్రాకర్స్‌ను నిషేధిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వ్యాపారులు సుప్రీంకోర్టులో శుక్రవారం లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం రెండు గంటల పాటు గ్రీన్‌ క్రాకర్స్‌ కాల్చేందుకు అనుమతినిచ్చింది. 
 

మరిన్ని వార్తలు