కోర్టు ఆదేశాలు జైలుకు పంపాక అమలు చేస్తారా? 

1 Nov, 2022 02:38 IST|Sakshi

తెలంగాణ విద్యుత్తు సంస్థలపై సుప్రీంకోర్టు అసహనం 

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విద్యుత్తు ఉద్యోగులను కోర్టు ఆదేశాల మేరకు విధుల్లోకి తీసుకున్నప్పటికీ సీనియారిటీ లెక్కింపు విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు తెలంగాణ విద్యుత్తు సంస్థలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ‘జైలుకు పంపాక ఆదేశాలు అమలు చేస్తారా?’అని ప్రశ్నించింది. విధుల్లోకి తీసుకున్నప్పటికీ సీనియారిటీ ప్రకారం వేతనాలు చెల్లించడం లేదని ఏపీ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం విచారించింది.

కోర్టు ఆదేశాల మేరకు 84 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకున్నామని, బకాయిలు చెల్లించేశామని తెలంగాణ విద్యుత్తు సంస్థల తరఫు సీనియర్‌ న్యాయవాదులు గిరి, రంజిత్‌కుమార్, రాకేష్‌ ద్వివేదిలు కోర్టుకు తెలిపారు. ఆదేశాలు అమలు అయినట్లేగా అని జస్టిస్‌ ఎంఆర్‌ షా వ్యాఖ్యానించగా.. ఉద్యోగుల తరఫు సీ నియర్‌ న్యాయవాది హరీన్‌ రావెల్, న్యాయ వాది రాజగోపాలరావులు అభ్యంతరం తెలిపారు.

ఏపీ నుంచి విధుల్లోకి తీసుకున్న సీనియర్ల కన్నా తెలంగాణలోని జూనియర్లకు ఎక్కువ వేతనం వస్తోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వలేదని తెలిపారు. ఏపీలో ఎంత ఇస్తున్నారో అంతే ఇస్తున్నారని వివరించారు. అంతర్రాష్ట్ర సీనియారిటీ ప్రకారం పదోన్నతులు ఏమయ్యాయని తెలంగాణ న్యా యవాదులను జస్టిస్‌ ఎంఆర్‌ షా ప్రశ్నించారు.  

గతంలోనూ గడువు అడిగారుగా.. 
పదోన్నతులు కల్పించాలంటే సీనియారిటీ లెక్కబెట్టాలంటూ, ఇందుకు నాలుగు వారాల గడు వు ఇవ్వాలని తెలంగాణ విద్యుత్తు సంస్థల తరఫు న్యాయవాదులు కోరారు. గతంలోనూ నాలుగు వారాలు అడిగారు కదా.. ఇంకా ఎందుకు అమలు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. సర్వీసు బుక్‌లు అందలేదని, కోర్టు ఆదేశాలు తూచా తప్పకుండా అమలు చేస్తామని న్యాయవాది గిరి తెలిపారు. దీంతో ఇంకా ఎప్పుడు పాటిస్తారు? జైలు పంపాక పాటిస్తారా? అని జస్టిస్‌ ఎఆంర్‌ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నాలుగు వారాలు గడువు ఇచ్చిన ధర్మాసనం.. సర్వీసు బుక్‌లు ఇవ్వాలని ఏపీ విద్యుత్తు సంస్థల్ని ఆదేశించింది.    

మరిన్ని వార్తలు