అక్రమ డిపాజిట్ల నిరోధక చట్టంపై సుప్రీంలో పిటిషన్‌

17 Oct, 2020 16:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అక్రమ డిపాజిట్ల నిరోధక చట్టం 2019 అమలు కావడం లేదంటూ సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ దాఖలు అయింది. తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్‌ ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆండాళు రమేష్ బాబు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. అగ్రిగోల్డ్ కంపెనీ 8 రాష్ట్రాలకు చెందిన 32 లక్షల మంది కస్టమర్ల చేత 6700 కోట్ల రూపాయలను డిపాజిట్ చేయించుకొని  బోర్డ్ తిప్పేశారు. మోసపోయిన బాధితులకు న్యాయం జరగాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా రమేశ్‌బాబు మాట్లాడుతూ.. వివిధ హైకోర్టుల్లో అగ్రిగోల్డ్ కేసులు 5 సంవత్సరాలుగా  పెండింగులో ఉన్నాయి. సెబీ ఉత్తర్వులు కూడా అమలు కావడం లేదు. ఆయా ప్రభుత్వాలు సైతం ఆస్తులు అటాచ్ మెంట్ చేస్తున్నారు తప్ప బాధితులకు డబ్బుల పంపిణీ చేయడం లేదు. ఐ.ఎమ్.ఇ  , సిరిగోల్డ్ , అక్షయ గోల్డ్,  అభయ గోల్డ్, హీరాగోల్డ్, అగ్రిగోల్డ్, బొమ్మరిల్లు, ఎన్ మార్ట్ లాంటి 200 కంపెనీలు 50 లక్షల మంది కస్టమర్ల వద్ద  వేలకోట్ల రూపాయల డిపాజిట్ లను వసూల్ చేసి మోసం చేసాయి.ఇలా మోసం చేసిన కంపెనీలపై అక్రమ డిపాజిట్ల నిరోధక చట్టం 2019 ప్రకారం కఠిన శిక్షలు అమలు చేసి బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని సుప్రీంకోర్టును కోరినట్లు పిటిషనర్ రమేష్ బాబు, తెలిపారు. కోర్టులలో కేసులు నడుస్తున్నా ప్రభుత్వాలు బాధితులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోవడంతో వేలాది మంది ఆత్మహత్య లకు పాల్పడడం నిజంగా బాధాకరం అని తెలిపారు. ఈ కేసు సుప్రీంకోర్టు లో ఈ నెల 26వ తేదీన విచారణ కు రానున్నట్లు  పిటిషనర్ రమేష్ బాబు వెల్లడించారు.

మరిన్ని వార్తలు