Suryapet: వీరశేఖర్‌పై పోలీసుల అరాచకం.. ఎస్సై లింగంపై వేటు

12 Nov, 2021 16:43 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట: రామోజీతండాకు చెందిన గిరిజన యువకుడిపై అత్యంత అమానుషంగా ప్రవర్తించిన ఆత్మకూర్‌(ఎస్‌) మండలం ఎస్‌ఐపై సస్పెషన్‌ వేటు పడింది. దొంగతనం కేసు విచారణలో గిరిజన యువకుడు వీరశేఖర్‌ను చితకబాదిన ఎస్ఐ ఎం.లింగంపై పోలీసు ఉన్నతాధికారుల చర్యలు చేపట్టారు. ఎస్ఐ లింగంను సస్పెండ్ చేస్తూ ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా సూర్యాపేట జిల్లాలో చేయని తప్పు ఒప్పుకోవాలంటూ  గిరిజన యువకుడిని పోలీసులు తీవ్రంగా చితకబాదిన ఘటన బుధవారం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ యువకుడిని గోడ కుర్చీ వేయించారు.. ఆ యువకుడి మూత్రాన్ని అతడితోనే తాగించి రాక్షసానందం పొందారు. అత్యంత అమానుషంగా ప్రవర్తించిన ఆత్మకూరు(ఎస్‌) ఠాణా పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
చదవండి: TSRTC: జర్నలిస్టులకు సజ్జనార్‌ గుడ్‌న్యూస్‌

కాగా ఇటీవల ఓ దొంగతనం కేసులో ఆత్మకూరు మండలంలోని రామోజీతండాకు చెందిన గుగులోతు వీరశేఖర్‌ను బుధవారం అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. విచారణ పేరుతో వీర శేఖర్‌పై పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. ఎస్సై లింగంతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు అతన్ని చితకబాదారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు కాల్‌ చేసిన వీరశేఖర్‌ను తీసుకెళ్లాలని అన్నారు. దీంతో ఒంటిపై గాయాలతో ఉన్న శేఖర్‌ను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. తరువాత వీరశేఖర్‌ బంధువులు ఆగ్రహంతో గురువారం ఆత్మకూర్‌.ఎస్‌ పోలీస్‌ స్టేషన్‌ ముట్టడికి యత్నించారు.
చదవండి: ఏడేళ్లుగా కేంద్రం నుంచి సహకారం లేదు: హరీశ్‌ రావు

నడవలేని స్థితిలో ఉన్న వీరశేఖర్‌ను ట్రాక్టర్‌పై తీసుకొచ్చి ఆందోళన చేశారు. దొంగతనంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా, వీరశేఖర్‌ను రోజంతా గోడకుర్చీ వేయించి కొట్టారని, బాధ్యులైన ఎస్సై, సిబ్బందిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా గిరిజన యువకుడు గుగులోతు వీరశేఖర్‌ను ఆత్మకూర్‌.ఎస్‌ పోలీస్‌స్టేషన్‌లో హింసించారన్న ఘటనపై లోతుగా విచారణ చేస్తున్నామని సూర్యాపేట డీఎస్పీ మోహన్‌ కుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు