ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కొరడా

7 Sep, 2021 12:29 IST|Sakshi

ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కొరడా

ఉత్తర్వులు జారీ చేసిన సూర్యాపేట కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి 

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పరిషత్‌ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి ఆదివారం జరిగిన ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయానికి సరెండర్‌ చేస్తూ సోమవారం కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గురుపూజోత్సవం సందర్భంగా లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి సీఈఓ ముఖ్య అతిథిగా హాజరై పలు వ్యా ఖ్యలు చేశారు.

‘ప్రభుత్వం కార్పొరేట్‌ చేతుల్లోకి వెళ్లడం దారుణం. కార్పొరేట్‌ సంస్థల లబ్ధికోసం పాఠశాలలు ప్రారంభించడం సిగ్గుచేటు. ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. కార్పొరేట్‌ స్కూళ్లు ఎప్పుడు తెరవాలం టే అప్పుడు.. ఎప్పుడు మూసేయాలంటే అప్పుడు ప్రభు త్వం విచ్చలవిడిగా అనుమతులు ఇస్తోంది. విద్యార్థుల భవిష్యత్‌ గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం, కార్పొరేట్‌ పాఠ శాలల యాజమాన్యాల కోసం పని చేస్తోంది. ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదు. తెలంగాణలో అనేక ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఆంధ్రా ప్రాంతానికి చెందిన కార్పొ రేట్‌ స్కూళ్లను ప్రభుత్వం ప్రోత్సహించడం దారుణం.  తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు దాపురించడం ఘోరం. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఉపాధ్యాయులు, మేధావులు కలసి వస్తే నా పదవికి రాజీనామాకైనా సిద్ధంగా ఉంటా’ అని ఆ సమావేశంలో ప్రేమ్‌కరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పలు సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్, ప్రింట్‌ మీడియాల్లో ప్రసారం కావడంతో ఆయనను పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయానికి సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.  

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు : ప్రేమ్‌కరణ్‌రెడ్డి 
తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని, కార్పొరేట్‌ వ్యవస్థతో జరుగుతున్న నష్టాల గురించి ఓ బాధ్యత గల పౌరుడిగా మాట్లాడానే తప్ప తానేదో నేరం చేసినట్టు శిక్ష వేయడం సమంజసం కాదని జెడ్పీసీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి అన్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా తాను మాట్లాడిన మొత్తం ప్రసంగాన్ని ప్రసారం చేయకుండా కేవలం ఒకటి రెండు అంశాలను తీసుకొని ప్రచారం చేయడం విచిత్రంగా ఉందన్నారు. కార్పొరేట్‌ వ్యవస్థ ఏ రకంగా తయారైందో చెబుతూ, లక్షల ఫీజులు వసూలు చేసి విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, నాటి సర్వేల్‌ గురుకుల పాఠశాలలో చదివిన ఎంతో మంది ఎలా ప్రయోజకులు అయ్యారో తెలిపానని పేర్కొన్నారు.

విద్యారంగాన్ని ప్రక్షాళన చేసేందుకు ఉపాధ్యాయులు, మేధావులు కలసి వస్తే పిల్లల కోసం రాజీనామాకైనా సిద్ధమే అని చెప్పానన్నారు. ఒక వైపు థర్డ్‌వేవ్‌ వస్తుందని ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నా, పాఠశాలలు ప్రారంభించడమేమిటని ప్రశ్నించారు. ఇప్పటికీ పది నుంచి 20 శాతం మంది పిల్లలే పాఠశాలలకు వస్తున్నారన్నారు. కరోనా విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయం పోలేదన్నారు. తన వ్యాఖ్యలపై కనీసం సంజాయిషీ ఇచ్చుకునే అవకాశం కూడా కల్పించకపోవడం సరికాదన్నారు.

మరిన్ని వార్తలు