Hyderabad: రాచకొండ పోలీసులను బురిడీ కొట్టించిన సీఐ నాగేశ్వరరావు

10 Jul, 2022 14:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహితను బెదిరించి అత్యాచారం చేసిన సీఐ నాగేశ్వరరావు రాచకొండ పోలీసులను బురిడీ కొట్టించాడు. నాగేశ్వరరావును అరెస్ట్‌ చేసేందుకు శనివారం సాయంత్రం ఎస్‌ఓటీ పోలీసులు రాగా.. డ్యూటీలో ఉన్నానని ఉదయం లొంగిపోతానని చెప్పాడు. అయితే అర్ధరాత్రి 12.15 నుంచి మొబైల్‌ స్వీచ్చాఫ్‌ చేశాడు. రెండు రోజులుగా నాగేశ్వరరావు పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. సీఐ కోసం నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి.ఇదిలా ఉండగా సీఐ నాగేశ్వరరావు అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఓ కేసులో అక్రమంగా బీఎండబ్ల్యూ కారును తన వద్దే ఉంచుకొని సీజ్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

కాగా సీఐ నాగేశ్వరరావును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్‌లోని ఏసీపీ కార్యాలయాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. డీసీపీ కార్యాలయం ముందు బైఠాయించి మహిళ లు, యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులే మహిళపై అత్యాచారం చేసి బెదిరింపులకు పాల్పడితే ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని డిమాండ్‌ చేశారు. .24 గంటల్లో సీఐ నాగేశ్వరరావుని అరెస్ట్ చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌లు ముట్టడిస్తామని హెచ్చరించారు. కాగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు  స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు