ట్రైనీ ఐపీఎస్‌ అధికారుల సాహసంపై ప్రశంసల జల్లు

7 Jun, 2021 10:25 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: నగరంలోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌పీఏ)లో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్‌లు సముద్రంలో మునిగిపోతున్న ఓ కుటుంబాన్ని కాపాడి వారి పాలిట ఆపద్భాందవులు అయ్యారు. ఎన్‌పీఏలోని ట్రైనీ ఐపీఎస్‌లు అభినవ్‌ ధీమాన్, అభినయ్‌ విశ్వకర్మ, భరత్‌ సోనీ, గౌహర్‌ హసన్, సువేందు పాత్ర, తెషూ లెందీప్‌ (భూటాన్‌ ) అహ్మద్‌ అబ్దుల్‌ అజీజ్‌ (మాల్దీవులు), మహమ్మద్‌ నజీవ్‌ (మాల్దీవులు) భారత్‌యాత్ర కార్యక్రమం కోసం ఇటీవల లక్షద్వీప్‌ దీవులకు వెళ్లారు.

అక్కడ వీరంతా బీచ్‌లో గడుపుతున్న సమయంలో భారత వైమానిక దళానికి చెందిన ఓ అధికారి కుటుంబం ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగిపోతుండటం చూశారు. వెంటనే ఈ ఎనిమిది మంది సముద్రంలోకి దూకి వారందర్నీ రక్షించారు. విషయం తెలిసిన అకాడమీ వీరి ధైర్య సాహసాలను ఆదివారం ప్రత్యేకంగా అభినందించి మీడియాకు వెల్లడించింది. ట్రైనీ ఐపీఎస్‌ అధికారుల సాహసంపై నెటిజన్లు ప్రశంసల వెల్లువ కురిపిస్తున్నారు.

చదవండి: నారాయణఖేడ్‌లో బొలేరో వాహనం బీభత్సం

మరిన్ని వార్తలు