సైబర్‌ బురిడీ: స్వాతి లక్రా పేరుతో కూడా..

21 Sep, 2020 20:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ అధికారుల ఫొటోలు, పేర్లు వినియోగించి ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు తెరుస్తున్న సైబర్‌ నేరగాళ్లు.. అమాయకుల్ని బురిడీ కొట్తిస్తున్నారు. వీటి ద్వారా ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపి, చాటింగ్‌ చేసి, డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. నగరంలోని మూడు కమిషనరేట్లలో ఉన్న అధికారులతో పాటు డీజీపీ కార్యాలయంలో పని చేసే వారి పేర్లతోనూ ఈ నకిలీ ఖాతాలు తెరుచుకున్నాయి. తాజాగా ఉమెన్ సేఫ్టీ అడిషనల్ డిజి స్వాతీ లక్రా పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలున్నట్టు వెల్లడైంది. తన పేరుతో కొందరు మోసగాళ్లు నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్లు తెరిచి ఫ్రెండ్‌ రెక్వెస్టులు చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె తన ఫేస్‌బుక్‌ ఖాతాలో స్పందించారు. ఎవరైనా పొరపాటుగా నకిలీ ఖాతాల నుంచి వచ్చిన ఫ్రెండ్‌ రెక్వెస్టులు యాక్సెప్ట్‌ చేస్తే.. వాటిని వెంటనే అన్‌ఫ్రెండ్‌ చేయాలని కోరారు.
(చదవండి: గిఫ్ట్‌‌ పేరుతో రూ. 6.3 లక్షలు స్వాహా)

నకిలీ ఖాతాలు సృష్టించినవారిపై చర్యలు తీసుకుంటామని స్వాతి లక్రా తెలిపారు. కాగా, పోలీస్‌ అధికారుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టిస్తున్న నేరగాళ్లు.. ఫ్రెండ్‌ రెక్వెస్టులు చేసి.. చాట్‌ చేస్తున్నారు. కాస్త నమ్మకం కలిగాక ఏవేవో కారణాలు చెప్పి డబ్బు వసూలు చేస్తున్నారు. ఒడిశా, గుజరాత్‌ల నుంచి సైబర్ నేరగాళ్ల ఆపరేషన్ జరుగున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 మంది పోలీసుల పేరుతో మోసాలు జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. 

ఎస్సై నుంచి డిజి హోదా వరకు అందరి పేర్లతో సైబర్ నేరగాళ్లు వసూళ్లకు పాల్పడ్డారు. నకిలీ ఖాతాల వ్యవహారంపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధిత అధికారులు యోచిస్తున్నారు. మరోవైపు ఇలాంటి నేరగాళ్ల బారినపడకుండా ఉండటానికి కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే తరహా మోసాలు బయటికొచ్చాయి. విజయవాడ, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పలువురు పోలీస్‌ అధికారుల పేర్లతో సైబర్‌ కేటుగాళ్లు ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరిచి అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేశారు.
(చదవండి: అధికారుల వివరాలతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు)

మరిన్ని వార్తలు