'మేం గొప్పలు చెప్పం.. చేసి చూపిస్తాం'

12 Sep, 2020 16:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రశంసలు కురిపించారు. నూతన రెవెన్యూ చట్టం శాసనసభలో ఆమోదం పొందడంపై  హర్షం వ్యక్తం చేస్తూ శనివారం మీడియాతో మాట్లాడారు. '2014 ముందు తెలంగాణ అనేక రకాలుగా ఇబ్బందులు పడింది. బడుగు బలహీన వర్గాలు గోస పడ్డారు. ప్రజల కష్టాలు తీరడానికి ఒక యుగ పురుషుడు వస్తాడు.. చరిత్ర ఒక యుగవురుషుణ్ణి పుట్టిస్తుంది. అలాంటి ఒక యుగ పురుషుడే సీఎం కేసీఆర్. ఏ పార్టీని ఎన్నుకుంటే తమ ఇబ్బందులు పోతాయో ప్రజలకు తెలుసు..కొత్త రెవెన్యూ చట్టం ఒక చర్రిత. ఉద్యమ నాయకుడుగా సీఎం మంచి నిర్ణయం తీసుకున్నారు. 

రైతుల కష్టాలు ఎన్నో ఉన్నాయి.నీళ్లు లేక కరెంట్ లేక అప్పులతో ఆత్మహత్యలు చేసుకున్నారు. గొప్పలు చెప్పే నాయకులకు ఒక్కటే మాట..మేం వాళ్లలా గొప్పలు చెప్పం ఏదైనా చేసి చూపిస్తాం . ఏ రాష్ట్రంలోనైనా 24 గంటల కరెంట్ ఇస్తున్నారా చెప్పాలి. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. గతంలో ఎండిపోయిన కంకులు ప్రదర్శిస్తూ అసెంబ్లీకి వచ్చేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.గత ప్రభుత్వాలు రైతే రాజు అని చెప్పారు.. కానీ ఆచరణ సాధ్యం కాలేదు.. అది సాధ్యం చేసింది సీఎం కేసీఆర్ మాత్రమే.' అంటూ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు