నన్నెవరూ ఆపలేరు.. మహిళా దర్బార్‌లో గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు

10 Jun, 2022 14:20 IST|Sakshi

ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకునేది లేదు

ఒక మహిళగా స్త్రీ సమస్యలకు ప్రాధాన్యత ఇస్తా.. పరిష్కరించే వరకు పోరాడతా

మహిళా దర్బార్‌ ఇకముందూ నిర్వహిస్తా.. 

రాజ్‌ భవన్‌కు రాష్ట్ర ప్రభుత్వ సహకారం సంతృప్తికరంగా లేదు

జూబ్లీహిల్స్‌ సామూహిక రేప్‌ ఘటనపై రెండురోజుల్లో నివేదిక ఇమ్మన్నా.. ఇప్పటివరకు ఇవ్వలేదు 

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకునేది లేదు. నా పని నేను చేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. మహిళల సమస్య లను పరిష్కరించే వరకు పోరాడతా..’ అని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పష్టం చేశారు. ఒక మహిళగా తను స్త్రీ సమస్యలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. రాష్ట్రంలోని మహిళల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ఒక బలమైన శక్తిగా ముందు నిలుస్తానని హామీ ఇచ్చారు.

శుక్రవారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన మహిళా ప్రజా దర్బార్‌ కార్యక్రమంలో గవర్నర్‌ పాల్గొన్నారు. హాజరైన మహిళలతో నింపాదిగా మాట్లాడి వారి సమస్య లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారినుద్దేశించి మాట్లాడారు. మహిళా దర్బార్‌కు పెద్దయెత్తున వినతులతో మహిళలు తరలి రావడంతో తన బాధ్యత మరింత పెరిగినట్లు భావిస్తున్నానని తమిళిసై చెప్పారు. మహిళా దర్బార్‌కు వచ్చిన ప్రతి వినతిని రికార్డు చేయటమే కాకుండా, ఆయా వినతులను సంబంధిత ప్రభుత్వ శాఖ లకు పంపించి వాటి పరిష్కారం కోసం నిరంతరం పర్యవేక్షి స్తానని తెలిపారు. ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే..

ఎన్నో సమస్యలతో మహిళలు సతమతం
‘రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్‌ విషయంలో ప్రభుత్వం గౌరవప్రదంగా ఉండాలి. ప్రొటోకాల్‌ పాటిం చాలి. కానీ రాజ్‌భవన్‌కు రాష్ట్ర ప్రభుత్వ సహకారం సంతృప్తి కరంగా లేదు. నాకు వ్యక్తిగత గౌరవం అక్కర్లేదు. ప్రజలకు సంబంధించిన సమస్యలపై స్పందిస్తే చాలు. ప్రజాదర్బార్, మహిళా దర్బార్‌కు వచ్చిన వినతులపై ఆయా శాఖలు వేగంగా స్పందించి పరిష్కరిస్తే సరిపోతుంది. నేను సీఎంను కలవనప్పటికీ ప్రజల సమస్యలు పరిష్కారమైతే చాలు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ముందుగా మహిళ లకు అం డగా ఉండాలనే ఉద్దేశంతో మహిళా దర్బార్‌ నిర్వహిస్తున్నా. కేవలం 24 గంటల క్రితమే దీనిపై నిర్ణయం తీసుకున్నా. విశేష స్పందన వచ్చింది. మహిళలు ఎన్నో సమస్యలతో సత మతమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు..’ అని తమిళిసై స్పష్టం చేశారు. 

రాజ్‌భవన్‌కు ఆ హక్కు ఉంది
‘కొందరు రాజ్‌భవన్‌లో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించ డాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ రాజ్‌భవన్‌కు ఇలాంటి కార్య క్రమాలు నిర్వహించే హక్కు ఉంది. ఇది రాజకీయ కార్యా లయం కాదు. నేను చేయదగిన కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నా. మహిళా దర్బార్‌ భవిష్యత్తులోనూ కొనసాగి స్తాను. జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసుకు సంబంధించి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించాను. ఇప్పటివరకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదు.

బహుశా వాళ్ల టైం స్లోగా నడుస్తున్నట్టుంది. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని నేను గౌరవిస్తాను. ప్రభుత్వం కూడా అలాగే స్పందించాలి. నేను వివాదాస్పద వ్యక్తిని కాదు. తెలంగాణ ప్రజలకు సేవ చేసే లక్ష్యంతో పని చేస్తున్నా..’ అని తెలిపారు.

ఒక వారధిగా ఉంటాను
‘ప్రభుత్వ కార్యాలయాలున్నదే ప్రజల కోసం. ఎలాంటి కార్యాలయమైనా ప్రజలు వచ్చే వీలుండాలి. కొందరు ‘గవ ర్నర్‌ ప్రజలను కలుస్తారా?’’ అని ప్రశ్నించారు. ప్రజలను కలిసేందుకే ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా. కోవిడ్‌–19 సమయంలో సెక్యూరిటీ వాళ్లు వద్దన్నా రోగులు, బాధిత వైద్యులు, వైద్య సిబ్బందిని కలిసి పరామర్శించాను. సమాజంలో ఎక్కువ శాతం బాధపడుతున్నది మహిళలే. ఒక మహిళగా నేను బాధిత మహిళలకు అండగా ఉండి, ఆదరిం చాలని ఆశిస్తున్నాను. నా తెలంగాణ మహిళలకు తోడుగా ఉండాలనుకుంటున్నాను.

మహిళలకు, ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా ఉంటాను. తెలంగాణ మహిళలు సురక్షితంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష. ఆ మహిళల వెన్నంటి ఉంటాను. నాకున్న బాధ్యతలను నేను సమర్థవంతంగా నెరవేరుస్తాను. బాధితుల స్వరాన్ని ప్రభుత్వానికి వినిపిస్తాను. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు ఇలాంటి మద్దతు చాలా అవసరం. మనం గెలుస్తాం. మహిళల గెలుపును ఎవరూ ఆపలేరు..’ అంటూ గవర్నర్‌ అచ్చ తెలుగులో మహిళలకు భరోసా ఇచ్చారు. దీంతో అక్కడున్నవారు పెద్దయెత్తున చప్పట్లతో మద్దతు పలికారు.

మహిళలకు రక్షణ లేదంటూ వినతులు
మహిళా దర్బార్‌కు పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి. దాదాపు 5 వందల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. వచ్చిన వారిలో ఎక్కువ మంది మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, వారిపై దాడులు విపరీతంగా పెరిగా యని, అడుగడుగునా అత్యాచారాలు జరుగుతున్నా యని, శాంతి భద్రతలు గాడి తప్పాయని ఫిర్యాదు చేశారు.

మరోవైపు జీఓ 317 కారణంగా పిల్లలకు దూరంగా ఉద్యోగం చేస్తున్నట్లు పాలిటెక్నిక్‌ కాలేజీ అధ్యాపకురాలు ఉదయశ్రీ గవర్నర్‌కు వినతి సమ ర్పిం చారు. సిద్దిపేట జిల్లా నంగునూరుకు చెందిన 92 సంవ త్సరాల కుందేటి పెద్దమ్మ.. తాను స్వాతంత్య్ర సమర యోధురాలినని, అయినా తనకు పింఛను రావడం లేదని వివరించారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, రాష్ట్ర మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు కూడా హాజరై వినతులు సమర్పించారు.  

ఇది కూడా చదవండి: రైతుబంధు నిధులు వెంటనే జమచేయాలి 

మరిన్ని వార్తలు