ప్లాస్మా దాతలతో గవర్నర్‌ రక్షాబంధన్‌ వేడుకలు

4 Aug, 2020 04:28 IST|Sakshi

ప్రాణదాతలను కొనియాడిన తమిళిసై సౌందరరాజన్‌

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్లాస్మా దాతలతో రక్షాబంధన్‌ను జరుపుకున్నారు. కరోనా నుంచి కోలుకుని, ప్లాస్మా దానం చేసి కోవిడ్‌ పేషెంట్లు కోలుకోవడానికి సాయం చేసిన 13 మంది ప్లాస్మా దాతలకు గవర్నర్‌ సోమవారం రాజ్‌భవన్‌లో రాఖీలు, స్వీట్లు అందించారు. రాజ్‌భవన్‌ దర్బార్‌ హాల్‌ లో జరిగిన ఈ ప్రత్యేక సంబురాల్లో భాగంగా గవర్నర్‌ ప్లాస్మా దాతల దాతృత్వాన్ని, ప్లాస్మా దానం కోసం వారు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. వారు ఇతరులకు స్ఫూర్తి దాతలని తమిళిసై కొనియాడారు. 

తక్కువ ఖర్చుతో కోవిడ్‌ చికిత్స..
13 మంది ప్లాస్మా దాతలు కోవిడ్‌ బారిన పడినప్పడు ప్రభుత్వ వైద్యశాలల్లోనే, ముఖ్యంగా గాంధీ హాస్పిటల్‌లోనే చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఇదే విషయాన్ని గవర్నర్‌ ప్రముఖంగా ప్రస్తావించారు. ‘ప్రభుత్వ ఆసుపత్రులు, అక్కడి వైద్యులు కోవిడ్‌–19 చికిత్సలో గొప్ప సేవలు చేస్తున్నారని’ అభినందించారు. ప్రజలు ఎలాంటి అపోహలకు తావు లేకుండా, ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కోవిడ్‌ చికిత్సను నమ్మకంగా తీసుకోవచ్చని, అక్కడ వైద్యులు, ఇతర సిబ్బంది అంకితభావంతో సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రులు కూడా కోవిడ్‌–19 బాధితులకు తక్కువ ఖర్చుతో, మానవతా దృక్పథంతో సేవలు అందించాలని, రోగులను, వారి కుటుంబాలను మరింత కుంగదీయకుండా బాధ్యతగా వ్యవహరించాలని గవర్నర్‌ సూచించారు.

ఈ సందర్భంగా ప్లాస్మా దాత లు తమ కరోనా చికిత్స, ప్లాస్మా దానం చేయడానికి వచ్చిన ప్రేరణ, తదితర విషయాలను గవర్నర్‌తో పంచుకున్నారు. గవర్నర్‌ ఈ దిశ గా చేస్తున్న కృషి తమలో స్ఫూర్తిని నింపాయ ని వివరించారు. గవర్నర్‌తో రాఖీలు, అభినం దనలు అందుకున్న ప్లాస్మా దాతలలో రాష్ట్రం లో మొట్టమొదటి కోవిడ్‌ పేషెంట్‌ రాంతేజ గంపాల, నాలుగు సార్లు ప్లాస్మా దానం చేసిన ఐఐటీ ముంబై, గ్రాడ్యుయేట్‌ బి.నితిన్‌కుమా ర్, రాష్ట్రంలో మొదటి ప్లాస్మా దాత ఎన్నంశెట్టి అఖిల్, సురం శివప్రతాప్, సయ్యద్‌ ముస్తఫా ఇర్ఫాన్, ఉమర్‌ ఫరూఖ్, డా. సుమీత్, జె.రా జ్‌కుమార్, పంజాగుట్ట ట్రాఫిక్‌ ఎస్సై పీ రామకృష్ణాగౌడ్, ఎస్‌. శివానంద్, డా. సాయి సోమసుందర్, డా. రూపదర్శిని ఉన్నారు. ఇందులో మొత్తం ఆరుగురు రెండు సార్లు, అంతకన్నా ఎక్కువసార్లు ప్లాస్మా దానం చేయడం అభినందనీయమని గవర్నర్‌ ప్రశంసించారు. 

మరిన్ని వార్తలు