ఆన్‌లైన్‌.. విద్యకు లైఫ్‌ లైన్‌: గవర్నర్‌

26 Aug, 2020 12:01 IST|Sakshi

సాక్షి, కాజీపేట: ఆన్‌లైన్‌ విద్యాబోధన కరోనా నేపథ్యంలో లైఫ్‌లైన్‌గా మారిందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. కాజీపేటలోని నిట్‌లో మంగళవారం ‘ఆన్‌లైన్‌ విద్య – అవకాశాలు – సవాళ్లు’ అంశంపై జాతీయ స్థాయి వెబినార్‌ను నిర్వహించారు. ఈ వెబినార్‌ను హైదరాబాద్‌ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా గవర్నర్‌ ప్రారంభించి మాట్లాడారు. కరోనా విజృంభన విద్యారంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని పేర్కొన్నారు. ఈ సమయంలో విద్యాబోధనను ఆన్‌లైన్‌లో కొనసాగిస్తున్నా కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో విద్యాలయాలు మరింత కృషి చేయాలని సూచించారు. 

ఆదర్శంగా తెలంగాణ
కోవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ఆన్‌లైన్‌ విద్యాబోధన అందిస్తూ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలవడం అభినందనీయమని గవర్నర్‌ పేర్కొన్నారు. కోవిడ్‌కు వాక్సిన్‌ వచ్చేంత వరకు నేరుగా తరగతి గదుల్లో విద్యాబోధన సాధ్యం కాదని, ఆన్‌లైన్‌ బోధనే ఉత్తమమని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, విజ్ఞానం, నైపుణ్యత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో నిట్‌ ముందంజలో నిలుస్తోందని నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ.రమణారావు తెలిపారు. దేశంలో నిర్వహించిన సర్వేలో వరంగల్‌ నిట్‌ ప్రథమంగా నిలిచిందని వెల్లడించారు. వెబినార్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఆనంద్‌కిషోర్, నిట్‌ రిజిస్ట్రార్‌ ఎస్‌.గోవర్దన్‌రావు, ప్రొఫెసర్లు శ్రీనివాస్, హీరాలాల్, గంగాధరన్‌తో పాటు వివిధ ప్రాంతాల నుండి వెయ్యి మంది ఆన్‌లైన్‌ ద్వారా వెబినార్‌లో లో పాల్గొన్నారు.

మాట్లాడుతున్న గవర్నర్‌ తమిళిసై  

మరిన్ని వార్తలు