ట్విట్టర్‌లో బొమ్మను చూసి.. 

25 Jul, 2021 01:48 IST|Sakshi
దివ్యాంగురాలికి ట్రైసైకిల్‌ అందజేస్తున్న గవర్నర్‌

దివ్యాంగ చిత్రకారిణి భుజం తట్టిన గవర్నర్‌ తమిళిసై

సాక్షి, హైదరాబాద్‌: ట్విట్టర్‌లో తనకు ట్యాగ్‌ చేసిన ఓ చిత్రాన్ని చూసి గవర్నర్‌ తమిళిసై ముగ్ధులయ్యారు. అంత అద్భుతంగా గీసిన పెయింటర్‌ ఓ దివ్యాంగ బాలిక అని తెలుసు కొని ఆమెను తన నివాసానికి పిలిపించుకొని భుజం తట్టారు. ఆ బాలికే నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం సాయిబండతండాకు చెం దిన ఫ్లోరోసిస్‌ బాధితురాలు రమావత్‌ సువర్ణ. తమిళిసై చిత్రపటాన్ని(పోర్ట్‌రైట్‌) సువర్ణ చక్కగా గీయగా, దానిని ఎన్‌ఆర్‌ఐ జలగం సుధీర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ గవర్నర్‌కు ట్యాగ్‌ చేశారు. గవర్నర్‌ స్పందించి సువర్ణతోపాటు ఆమె కుటుంబసభ్యులను శనివారం రాజ్‌భవన్‌కు పిలిపించారు. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి కాశీనాథ్‌గౌడ్‌ కుటుంబసభ్యులు, డాక్టర్‌ విజయభాస్కర్‌గౌడ్‌కు చెందిన ఓ ఫౌండేషన్‌ సహకారంతో ఆమెకు ఒక ట్రైసైకిల్‌ను బహూకరించారు. అనంతరం వారితో కలసి భోజనం చేశారు. సువర్ణ తన చదువుతోపాటు పెయింటింగ్‌ను కూడా కొనసాగించాలని, అవసరమైన సహాయ సహకారాలను అందజేస్తానని హామీ ఇచ్చారు. ట్రైసైకిల్‌ దాతలను గవర్నర్‌ అభినందించారు. 

ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి: గవర్నర్‌      
కరోనాను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని గవర్నర్‌ తమిళిసై  పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజినల్‌ ఔట్‌రీచ్‌ బ్యూరో(ఆర్‌ఓబీ) కోవిడ్‌ జాగ్రత్తలపై ఏర్పాటు చేసిన డిజిటల్‌ మొబైల్‌ వీడియో పబ్లిసిటీ వాహనాలను శనివారం ఆమె రాజభవన్‌లో ప్రారంభించారు.    

మరిన్ని వార్తలు