అప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌: తరుణ్‌ చుగ్‌

24 Feb, 2023 08:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది సంస్థాగత ఎన్నికలు జరిగే దాకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ కొనసాగుతారని ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జీ తరుణ్‌ చుగ్‌ వెల్లడించారు. గురువారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ 2024లో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో ‘ప్రజాగోస– బీజేపీ భరోసా’పేరిట నిర్వహిస్తున్న స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.

ఈ మీటింగ్‌ల ద్వారా కేసీఆర్‌ సర్కార్‌కు చివరి మేకు దించేందుకు బీజేపీ సిద్ధమవుతోందన్నారు. వచ్చే నెల 11వ తేదీ నాటికి సంజయ్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తవుతుండటంతో ఆయన పదవీకాలం ముగియనుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 2024 జూన్‌ వరకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డాను కొనసాగిస్తూ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంజయ్‌ పదవీకాలాన్ని పొడిగిస్తారనే చర్చ కొంతకాలంగా సాగుతున్న విషయం తెలిసిందే. వచ్చేనెల మొదటివారంలో అధ్యక్షుడిగా సంజయ్‌ పదవీకాలం పొడిగింపునకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం.

చదవండి   Hyderabad: మామిడి చెట్టు తెచ్చిన  తంటా!.. మేడ మీద ఆకులు పడుతున్నాయని

మరిన్ని వార్తలు