టౌటే తుపాను ప్రభావంతో నేడు, రేపు వర్షాలు
రాష్ట్రంలో ఓ మోస్తరు వానలు..
సాక్షి, హైదరాబాద్: టౌటే తుపాను ప్రభావం రాష్ట్రంపైనా ఉంటుందని, వివిధ జిల్లాల్లో ఆది, సోమవారాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రధానంగా రాష్ట్ర దక్షిణ, మధ్య ప్రాంతంలోని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మహబూబ్నగర్, నారాయణ్పేట్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల, అదే విధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
సాధారణ ఉష్ణోగ్రతలే...రాష్ట్రంలో శనివారం సాధారణ ఉష్ణోగ్రతలు æనమోదయ్యాయి. నల్లగొండలో 42.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, మెదక్లో 22.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తుపాను ప్రభావం రాష్ట్రంపైన ఉండడంతో ఆది, సోమవారాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.