జైలు నుంచి విడుదలైన అఖిల ప్రియ

23 Jan, 2021 18:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలైన భూమా అఖిలప్రియ జైలు నుంచి విడుదలయ్యారు. కిడ్నాప్‌ కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉంటున్న ఆమెకు బెయిల్‌ లంభించడంతో శనివారం బయటకు వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఆమె 18 రోజులుగా జైలులోనే ఉంటున్న విషయం తెలిసిందే. బెయిల్‌ కోసం విఫల ప్రయత్నాలు చేసినప్పటికీ కోర్టుల్లో అనేక సార్లు నిరాశే ఎదురైంది. ఈ క్రమంలోనే అఖిలప్రియకు బెయిల్‌ మంజూరు కావడంతో బెయిల్ ఆర్డర్ కాపీలను ఆమె తరుఫు న్యాయవాదులు జైలుకు తీసుకువచ్చారు. అఖిలప్రియకు శుక్రవారం సెసెషన్స్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అఖిల ప్రియ విడుదలతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. (మంత్రిగా ఉన్నప్పటి నుంచే ‘మ్యాన్‌పవర్‌’!)

మరోవైపు అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్‌ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో 19 మందిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హఫీజ్‌పేట భూవివాదం నేపథ్యంలో జరిగిన ఈ కిడ్నాప్‌ కేసులో ముఖ్య నిందితులు అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి, అనుచరుడు గుంటూరు శ్రీను, భార్గవ్‌రామ్‌ తల్లిదండ్రులతో సహా మరో 9 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు