ఓరుగల్లులో టెక్నాలజీ సెంటర్

26 Nov, 2020 05:15 IST|Sakshi
నాలెడ్జ్‌ సెంటర్‌ ఏర్పాటుకు వరంగల్‌ రంగశాయిపేటలో ఎంపిక చేసిన స్థలమిదే..

రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌లోనే...

రూ.300 కోట్ల వ్యయంతో ఏర్పాటు 

టెక్స్‌టైల్‌ రంగ నిపుణుల కోసం కోర్సులు 

రంగశాయిపేట శివారులో 25 ఎకరాల స్థలం ఎంపిక 

స్థలం అప్పగించాలని కలెక్టర్‌కు టీఎస్‌ఐఐసీ లేఖ 

సాక్షి, వరంగల్‌ రూరల్‌:  వరంగల్‌ రూరల్‌ జిల్లా టెక్స్‌టైల్‌ పార్క్‌లో టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ మైక్రో స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ ప్రైజెస్‌ (ఎంఎస్‌ఎంఈ) ఆధ్వర్యాన వరంగల్‌ అర్బన్‌ జిల్లా రంగశాయిపేట రెవెన్యూ పరిధి 170వ సర్వే నంబర్‌లోని 25 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో స్థలాన్ని స్వాదీనం చేయాలని టీఎస్‌ఐఐసీ అధికారులు వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌కు తాజాగా లేఖ రాశారు. స్థలం కేటాయింపు పూర్తికాగానే టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యాన అభివృద్ధి చేసి ఎంఎస్‌ఎంఈకు అప్పగిస్తారు. కాగా, ఇక్కడ రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వ్యయంతో టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటు చేస్తారు.  

నాలుగేళ్ల వ్యవధితో కోర్సులు
టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటయ్యాక రెండు వారాల నుంచి నాలుగేళ్ల వ్యవధితో కోర్సులు ప్రారంభిస్తారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్‌తో పాటు టెక్స్‌టైల్‌కు సంబంధించిన కోర్సులు అందుబాటులోకి వస్తాయి. ఇందులో ఐటీఐ నుంచి ఎంటెక్‌ చదివిన వారి వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉంటుంది. ఇతరులు మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సెంటర్‌లో నూతనంగా పరిశ్రమలు స్థాపించే వారికే కాకుండా సంస్థల్లో పనిచేసే నిరుద్యోగులకు కూడా నైపుణ్యాల పెంపుపై శిక్షణ ఇస్తారు.

ఇదే సమయంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించే వారికి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. వస్త్రాలు, దుప్పట్లు, లుంగీలు, వంటి తయారీ యూనిట్లతో పాటు స్పిన్నింగ్, జిన్నింగ్‌ యూనిట్లను క్రమపద్ధతిలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఐదు దశల్లో స్పిన్నింగ్, టెక్స్‌టైల్, వీవింగ్, నిట్టింగ్‌ ప్రాసెసింగ్, ఊవెన్‌ ఫ్యాబ్రిక్, యార్న్, టవల్‌ షిటింగ్, ప్రింటింగ్‌ యూనిట్లు, రెడీమేడ్‌ వ్రస్తాల తయారీ వంటి తొమ్మిది విభాగాల్లో పరిశ్రమలు టెక్స్‌టైల్‌ పార్క్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో వాటికి సంబంధించిన నిపుణులను టెక్నాలజీ సెంటర్‌ తయారు చేయనుంది. 

మరిన్ని వార్తలు