Telangana Police: వర్రీలో వారియర్స్‌

7 May, 2021 08:12 IST|Sakshi

పోలీసు విభాగంలో కరోనా నిరోధం మాటల్లోనే..

 ఇప్పటికీ ఠాణాలకు మాస్క్‌ల సరఫరా లేదు

 సొంతంగా ఖరీదు చేయడానికి నిధుల కొరత  

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ ఆస్పత్రి, వాక్సినేషన్‌ సెంటర్, కరోనా మృతుల మార్చురీ, కర్ఫ్యూ చెక్‌పోస్టు, మాస్కుల ధారణపై చెకింగ్స్‌.. ఇలా ఎక్కడ చూసినా కనిపించే ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ పోలీసులు. అయితే వీరికి అవసరమైన ‘భద్రత’ కల్పించడంలో అటు ప్రభుత్వం, ఇటు ఉన్నతాధికారులు విఫలమవుతున్నారు. ఫస్ట్‌ వేవ్‌లో పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది అశువులు బాశారు. సెకండ్‌ వేవ్‌లోనూ పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. దీంతో ఈ వారియర్స్‌తో పాటు వారి కుటుంబాల నుంచీ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పోలీసు విభాగంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య వెయ్యి దాటగా.. దాదాపు 15 మంది వరకు ఈ మహమ్మారి కాటుకు బలయ్యారు.  

► మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లు వాడండి అంటూ గడిచిన కొన్ని రోజులుగా వాట్సాప్, ట్విట్టర్‌ తదితర సోషల్‌మీడియాల వేదికగా పోలీసు ఉన్నతాధికారులు ప్రకటనలు చేస్తున్నారు. తమ సిబ్బంది విషయంలో మాత్రం ఆ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు.  

► సెకండ్‌ వేవ్‌ పంజా విసరడం మొదలెట్టి నెల రోజులు కావస్తున్నా.. ఇప్పటికీ పోలీసుస్టేషన్లలోని అధికారుల మాట అటుంచితే బందోబస్తు, రిసెప్షన్‌ సిబ్బందికి మాస్‌్కలు, శానిటైజర్ల సరఫరా జరగలేదు. ఇక పీపీఈ కిట్స్‌ అనే ఆలోచనే వాస్తవదూరంగా అయిపోయింది. 

► సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్‌ సంస్థలు అనేక ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. వీటిలో భాగంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వంటివి అమలు చేస్తున్నాయి.పోలీసు విభాగానికి మాత్రం ఇలాంటి అవకాశాలు లేకుండా పోయాయి.

► పోలీసు అధికారులు నేరుగా ప్రజలతో సంబంధాలు కలిగి ఉండి పనిచేయాల్సి ఉంటోంది. ఉన్నతాధికారులైన డీసీపీలు, ఏసీపీలకు తక్కువైనా ఇన్‌స్పెక్టర్, ఎస్సైలు,  రిసెప్షన్స్‌లో సిబ్బందికి తాకిడి ఎక్కువ. 

► కోవిడ్‌ బారినపడిన పోలీసుల కోసం పేట్ల బురుజులో రెండు ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. గతంలో గోషామహల్‌ స్టేడియంలో ఏర్పాటైన కరోనా పరీక్ష కేంద్రం, ఆపై హెచ్‌సీక్యూ మందుల పంపిణీ మాదిరిగా వీటి పని తీరు ఉండకూడదని సిబ్బంది కోరుతున్నారు.  

( చదవండి: వాట్సప్‌ చేస్తే ఉచిత భోజనం.. వారికి మాత్రమే! )

మరిన్ని వార్తలు