Polytechnic Question Paper Leak. ఆ రెండు పరీక్షలు రద్దు

11 Feb, 2022 18:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రశ్నా పత్రాలు లీక్‌ అవ్వడంతో ఈ నెల 8,9 తేదీల్లో జరిగిన రెండు పాలిటెక్నిక్‌ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సాంకేతిక విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. రద్దైన రెండు పరీక్షలు ఈ నెల 15,16 తేదీల్లో జరుగుతాయని బోర్డు అధికారులు వెల్లడించారు. ​​కాగా ఫిబ్రవరి 8న మొదలైన పాలిటెక్నిక్‌ పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే బాలసింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాల నుంచి పాలిటెక్నిక్‌ ఫైనలియర్‌ ప్రశ్నాపత్రాలు లీకయినట్లు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.  ప్రశ్నాపత్రాల లీక్‌ను గుర్తించిన ఇతర జిల్లాల్లోని ప్రిన్సిపల్స్‌ బోర్డుకు సమాచారం అందించడంతో ఈ విషయం కాస్త బయటకు వచ్చింది.

బోర్డు అధికారుల ఫిర్యాదు మేరకు స్వాతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్‌ ద్వారా విద్యార్థులకు పంపించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అబ్జర్వర్‌గా ఉన్న అధికారిని సస్పెండ్‌ చేశారు. స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ కాలేజీలో ప‌రీక్ష కేంద్రాన్ని కూడా ర‌ద్దు చేశారు. అక్కడ పరీక్షలు రాస్తున​ విద్యార్థులను వేరే కేంద్రాలకు బదిలీ చేశారు. ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీకి కార‌ణ‌మైన స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ కాలేజీకి షోకాజు నోటీసులు జారీ చేశారు. కాలేజీ అనుమ‌తి ఎందుకు ర‌ద్దు చేయ‌కూడ‌దో చెప్పాల‌ని విద్యామండ‌లి ప్ర‌శ్నించింది. వారంలోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కాలేజీ యాజ‌మాన్యానికి ఆదేశాలు జారీ చేసింది.
చదవండి: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

మరిన్ని వార్తలు