Telangana: రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో రికార్డు.. 6.50 లక్షల ర్యాంకుకూ ఎంబీబీఎస్ సీటు

19 Dec, 2022 10:11 IST|Sakshi

ప్రైవేట్‌లో ఎంబీబీఎస్‌ సీటుకు భారీగా తగ్గిన కటాఫ్‌ 

లోకల్‌ రిజర్వేషన్‌తో రాష్ట్ర విద్యార్థులకు పెరిగిన అవకాశాలు 

మాప్‌ అప్‌ రౌండ్‌ పూర్తయినా 188 సీట్ల మిగులు 

అందులో బీ– కేటగిరీ, ఎన్‌ఆర్‌ఐ సీట్లు కూడా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో రికార్డు ఇది. ఎన్నడూ లేనంతగా ఇప్పుడు లక్షలాది ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు కూడా ఎంబీబీఎస్‌లో సీట్లు దక్కుతున్నాయి. గతేడాది ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో బీ కేటగిరీ సీటు నీట్‌లో 2.70 లక్షల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు రాగా, ఈసారి ఏకంగా 6.50 లక్షల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు కూడా సీట్లు దక్కడం రికార్డు అని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఎన్‌ఆర్‌ఐ కోటాలోనైతే గతేడాది 9 లక్షల ర్యాంకుకు సీటు రాగా, ఈసారి దాదాపు 10 లక్షల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు కూడా సీటు వచ్చిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.  

85% రిజర్వేషన్‌తో తగ్గిన కటాఫ్‌ 
రాష్ట్రంలో ప్రస్తుతం 17 ప్రభుత్వ, 24 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. అందులో ఈసారి కొత్తగా ఎనిమిది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ప్రారంభం కావడంతో ఒక్కసారిగా సీట్ల సంఖ్య పెరిగింది. ప్రభుత్వంలో అన్నీ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో సగం సీట్లు కనీ్వనర్‌ కోటా కింద సీట్లు కేటాయిస్తారు. ప్రైవేట్‌లో సగం సీట్లు యాజమాన్య కోటా కింద కేటాయిస్తారు. 50 శాతంలో 35 శాతం బీ కేటగిరీ, మరో 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా కింద కేటాయిస్తారు. కన్వీనర్‌ కోటా సీట్లకు ప్రభుత్వంలో రూ. 10 వేలు, ప్రైవేట్‌లో రూ. 60 వేలు ఏడాది ఫీజు ఉంటుంది.

ఇక ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో బీ కేటగిరీ ఫీజు రూ. 11.55 లక్షలు ఏడాదికి, ఎన్‌ఆర్‌ఐ ఫీజు బీ కేటగిరీకి రెట్టింపు వరకు వసూలు చేసుకోవచ్చు. ప్రభుత్వం పెంచిన మెడికల్‌ కాలేజీలతో మంచి ర్యాంకులు వచి్చన విద్యార్థులకు అందులో కన్వీనర్‌ కోటా సీట్లు రాగా, మిగిలిన విద్యార్థులకు బీ–కేటగిరీ సీట్లు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బీ–కేటగిరీలో 85%  స్థానిక రిజర్వేషన్‌ తీసుకురావడంతో వెయ్యికి పైగా సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు దక్కాయి. అందుకే ఇతర రాష్ట్రాల విద్యార్థులు తక్కువ మంది దర ఖాస్తు చేసుకున్నారు. దీంతో 6.50 లక్షల ర్యాంకు వచి్చన విద్యార్థులకు కూడా ఈసారి బీ– కేటగిరీలో సీట్లు దక్కా యని చెబుతున్నారు. దీంతో భారీగా కటాఫ్‌ తగ్గిందని అధికారులు చెబుతున్నారు. 

మిగిలిన సీట్లు 188.. 
ప్రస్తుతం అన్ని కేటగిరీలకు చెందిన సీట్లకు మాప్‌ రౌండ్‌ వరకు సీట్ల కేటాయింపు పూర్తయింది. మరో స్పెషల్‌ రౌండ్‌ నిర్వహించాలని భావిస్తున్నారు. వాస్తవానికి మాప్‌ రౌండ్‌తోనే కౌన్సెలింగ్‌ ముగిస్తారు. కానీ బీ, ఎన్‌ఆర్‌ఐ కోటాలో సీట్ల మిగులుతో మరో రౌండ్‌ కౌన్సెలింగ్‌కు కాళోజీ ఆరోగ్య వర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది. లెక్కల ప్రకారం బీ,సీ–కేటగిరీల్లో 188 ఎంబీబీఎస్‌ సీట్లు మిగిలాయి. గతేడాది 144 ఎంబీబీఎస్‌ సీట్లు మిగిలా యి. కొందరు చేరాక సీట్లు వదులుకోవడం, కొందరు బ్లాక్‌ చేయడం, కొన్ని కాలే జీల్లో ఎన్‌ఆర్‌ఐ సీట్లకు భారీ ఫీజులు ఉండటంతో చేరకపోవడం ఇందుకు కారణం.
చదవండి: విదేశీ కొలువు.. బహు సులువు.. 140కి చేరిన రిక్రూటింగ్ ఏజెన్సీలు..

మరిన్ని వార్తలు